న్యూదిల్లీ: హనుమాన్ జయంతి సందర్భంగా రెండు వర్గాల మధ్య హింస చెలరేగిన దిల్లీలోని జహంగీర్పురిలో భారీగా భద్రతా దళాలను మోహరించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ భద్రతా బలగాలను కొనసాగిస్తామని చెప్పారు. హనుమాన్ జయంతి ఊరేగింపును పురస్కరించుకొని జహంగీర్పురిలో శనివారం రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇందులో 8మంది పోలీసులు, స్థానికుడు గాయపడ్డారు. ఘర్షణల సమయంలో రాళ్లు రువ్వుకున్నారు. గృహదహనాలు జరిగాయి. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. జహంగీర్పురితోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని మోహరించినట్లు దిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్తానా సోమవారం చెప్పారు. జహంగీర్పురితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భారీగా బలగాలను మోహరించామని, నిఘా కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్లో ఎలాంటి హింస చెలరేగకుండా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. ఊరేగింపుపై దాడి జరిగినట్లు చెబుతున్న మసీదు ఎదురు రోడ్డును మూసివేశారు. బారికేడ్లతో మొత్తం ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. బారికేడ్ల వద్ద పోలీసులు టెంట్లు వేసుకొని పికెటింగ్ చేస్తున్నారు. 500 మంది పోలీసులు, ఆరు కంపెనీల అదనపు బలగాలను మోహరించారు. 80 బాష్పవాయువు తుపాకీ పార్టీలు, నీటి ఫిరంగులను రంగంలో దించారు. నిఘాలో భాగంగా డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించడానికి సీనియర్ అధికరులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. జహంగీర్పురిలోని అమన్ కమిటీ సభ్యులతో పాటు పోలీసులు సోమవారం శాంతి యాత్ర చేశారు. శాంతి, సామరస్యతను పాటించాల్సిందిగా శాంతి కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని విన్నవించింది.