అమ్మఒడి లో కోత…ఆరోగ్య శ్రీ నిధులు లేమి
నవ రత్నాలకు తిలోదకాలిస్తున్న జగన్
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి
ఉద్యోగుల జిపిఎఫ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల కోట్ల రూపాయలు మళ్లించడంతో ఉద్యోగుల జీవితాలు అగమ్య గోచరంగా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథరెడ్డి ఆరోపించారు. బుధవారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రావిడెంట్ ఫండ్ నిధులు ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించడంతో 90 వేల మంది ఉద్యోగులు వారి పిల్లల వివాహాలు, అనారోగ్య సమస్యల కోసం, ఇళ్ళ నిర్మాణాల కోసం విత్ డ్రా చేసుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ పథకం లో సైతం ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేదని అన్నారు. దీంతో ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయించుకునేందుకు వెళ్ళితే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం తిరస్కరిస్తోంది అని పేర్కొన్నారు. నేడు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసుకుంటే డబ్బులు నేరుగా రోగుల అకౌంట్ కే వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం చూస్తే ఈ పథకాన్ని కూడా పేదలకు దూరం గా విధించే పరిస్థితి నెలకొందని అన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా 44 వేల మందికి లబ్ధి చేకూరిందని ముఖ్యమంత్రి వూకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారు అన్నారు. కరెంటు బిల్లులు 200 దాటిందని, తల్లిదండ్రులు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు వంటి కుంటి సాకులతో కోత విధించారని చెప్పారు. ఇప్పటికీ అనేక మంది అకౌంట్ లో డబ్బులు పడక ఎప్పుడు వేస్తావ్ మామ అని ఎదురు చూస్తున్నారని , మరో వైపు గత ఏడాది వెయ్యి రూపాయలు వెనక్కు తీసుకుని ఈ ఏడాది రెండు వేలు తీసుకున్నావ్ ఏంది మామా అంటూ విద్యార్థులు ఎద్దేవా చేస్తున్నారనీ పేర్కొన్నారు. జగన్ మడమ తిప్పడం తెలియదని అన్నీ పథకాల్లో కోత విధించి చివరకు నవ రత్నాలు ఒక్కొక్కటిగా నేల రాలి పోతున్నాయని తీవ్రంగా విమర్శించారు . జగన్ వైఫల్యాల పై సిపిఐ ప్రజలను చైతన్య పరచి పోరాటం సాగిస్తుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, నగర కార్యదర్శి జె . విశ్వనాథ్ పాల్గొన్నారు.