డయాఫ్రం వాల్ నిర్మాణడిజైన్లు నెలాఖరుకి సిద్ధం
వచ్చే ఏడాది జూన్కి వెలిగొండ`2 టన్నెల్ పూర్తి
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టు పనులు వేగవంతం
జలవనరుల శాఖ సమీక్షలో సీఎం జగన్ ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి:
పోలవరం దిగువ కాఫర్ డ్యాం పనులు జులై 31వ తేదీకల్లా ఎట్టిపరిస్థితుల్లో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వారీ పనుల ప్రగతి వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం దిగువ కాఫర్ డ్యామ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, జులై నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే 68 శాతం పనులు పూర్తయ్యాయని, దిగువ కాఫర్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఇసుకతో నింపేందుకు అన్నిరకాల ప్రయత్నాలు మొదలు పెట్టామని తెలియజేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ నిర్మాణ డిజైన్లపై ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని, నెలాఖరు నాటికి స్పష్టత వస్తుందన్నారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రూ.2,559.37 కోట్లు రీయంబర్స్ చేయాల్సి ఉందని తెలపగా, వీలైనంత త్వరగా డబ్బును తెప్పించుకునే ప్రయత్నాలు చేయాలని సీఎం సూచించారు. పీపీఏ అనుమతి ఇచ్చిన తర్వాతనే ప్రతి పనీ జరుగుతుందన్నారు. పనులు వేగంగా పూర్తిచేయాలన్న దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తన డబ్బు ఖర్చు చేస్తోందని, చేసిన పనులకు సంబంధించి బిల్లులు వెంటనే రీయింబర్స్ జరిగేలా కేంద్ర ప్రభుత్వ అధికారులతో జరిగే సమావేశంలో ప్రస్తావించాలని అధికారులకు సీఎం సూచించారు. నెల్లూరు, సంగం బ్యారేజీ నిర్మాణ పనులు నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక వెలిగొండ ప్రాజెక్టు పనుల ప్రగతిని వివరిస్తూ సెప్టెంబరులో టన్నెల్-1 ద్వారా నీటిని విడుదల చేస్తామని, జూన్, 2023 నాటికి టన్నెల్ – 2 పనులు పూర్తి చేస్తామని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఈలోగా పునరావాస కార్యక్రమాలను పూర్తిచేయాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను సమీక్షిస్తూ వంశధార, గొట్టా బ్యారేజీ లిప్టు, నేరడి బ్యారేజీ నిర్మాణం, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టుల నిర్మాణ పనుల ప్రగతి వివరాలను సీఎం ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాయలసీమ ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. తాగు, సాగునీటికి తీవ్ర కొరత ఉన్న కర్నూలు పశ్చిమ ప్రాంత ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. నీటికొరత కారణంగా ఈ ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని నివారించేందుకు సాధ్యమైనంత వేగంగా ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే చిత్తూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు తాగు, సాగునీటిని అందించాలని, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టు, మడకశిర బైపాస్ కెనాల్, జీఎన్ఎస్ఎస్ ఫేజ్`2 (కోడూరు వరకు), జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ లిఫ్ట్ స్కీం, ఎర్రబాలి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నుంచి యూసీఐఎల్ సప్లిమెంట్, రాజోలి, జలదిరాశి రిజర్వాయర్లు(కుందూ నది), రాజోలి బండ డైవర్షన్ స్కీం, వేదవతి ప్రాజెక్టు, మంత్రాలయం-5 లిఫ్ట్ స్కీంలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, సీఎస్ సమీర్ శర్మ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్.రావత్, జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.