Friday, April 19, 2024
Friday, April 19, 2024

జోరు వానలు..

పొంగి పోర్లుతున్న వాగులు

తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం

దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకంగా మారినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడిరచింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఒడిశా`కోస్తాంధ్ర తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. మరోవైపు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ మరో ఉపరితలం ద్రోణి కూడా కొనసాగుతోందని తెలిపింది. వీటి ప్రభావంతో జమ్ము,కశ్మీర్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు ఐఎండీ తెలిపింది.
రుతుపవనాల గమనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం గరికిపాలెంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 122.5 మి.మీ వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో 110.5 మి.మీల వర్షం కురిసింది. మరోవైపు ఉత్తర, దక్షిణ కోస్తాలోని తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడిరచింది. అటు రాయలసీమలోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
పెరుగుతున్న గోదావరి వరద
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం వద్ద శుక్రవారం సాయంత్రం నుంచి వరద పోటు పెరగడంతో పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. పోశమ్మగండి వద్ద గండిపోశమ్మ అమ్మవారి ఆలయంలోకి భారీగా నీరు చేరడంతో దర్శనాలను నిలిపివేశారు. చినరమణయ్యపేట- దండంగి మధ్య సీతపల్లి వాగుపైకి వరద నీరు చేరడంతో దేవీపట్నం వైపు రాకపోకలు నిలిపివేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో శుక్రవారం ఉదయం నుంచి భారీవర్షాలు కురుస్తుండగా… ఎన్టీఆర్‌, తిరుపతి, నంద్యాల, పల్నాడు, వైయస్‌ఆర్‌, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాజధాని హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.నిజామాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, నల్గొండ జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి. భారీవర్షాలతో నిజామాబాద్‌ జిల్లా భోదన్‌ నియోజకవర్గంలోని పలు చెరువులు అలుగు పారుతున్నాయి. నవిపేట మండలం జన్నపల్లి పెద్ద చెరువు అలుగు పారుతుంది. మండలంలోని లింగాపూర్‌ శివారులో వరద ఉధృతికి తుంగిని మాటు కాల్వకు పలుచోట్ల గండిపడి నీరు పంట పోలాల్లోకి చేరి సుమారు వంద ఎకరాల పంట నీట మునిగింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం కొండూరులో 186 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు గా తెలుస్తోంది. నిర్మల్‌ జిల్లా అబ్దుల్లాపూర్‌ లో 178 మిల్లీ మీటర్లు, నిజామాబాద్‌ జిల్లా కొండపల్లిలో 158 మిల్లీ మీటర్లు, సూర్యాపేట జిల్లా మునగాల లో 156 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img