Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టాటా గ్రూప్‌ చేతికి ఎయిరిండియా

అధికారికంగా అప్పగించిన మోదీ సర్కారు
న్యూదిల్లీ:
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా టాటాల వశమైంది. ఎయిరిండియా యాజమాన్య హక్కులను అధికారికంగా టాటా గ్రూప్‌నకు కేంద్రం గురువారం బదలాయించింది. బిడ్డింగ్‌లో ఎయిరిండియాను దక్కించుకున్న టాటా అనుబంధ సంస్థ ట్యాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అధికారికంగా ఎయిరిండియాను అప్పగించినట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత్‌ పాండే గురువారం మీడియాకు తెలిపారు. ఎయిరిండియా అప్పగింత ప్రక్రియ పూర్తయినందుకు సంతోషంగా ఉందని టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. ప్రపంచస్థాయి సేవలందించేందుకు టాటా గ్రూప్‌ కట్టుబడి ఉందని చెప్పారు. టాటా గ్రూప్‌ ఉద్యోగులుగా మారనున్న ఎయిరిండియా ఉద్యోగులను సంస్థలోకి ఆహ్వానించారు. ఎయిరిండియా అప్పగింత పట్ల రతన్‌ టాటా సంతోషం వ్యక్తంచేశారు.
అంతకుముందు, ప్రధాని మోదీతో చంద్రశేఖరన్‌ భేటీ అయ్యారు. ఎయిరిండియాను అధికారికంగా టాటాలకు అప్పగించే ప్రక్రియలో భాగంగా ఈ భేటీ జరిగింది. వీరిద్దరి భేటీకి సంబంధించిన చిత్రాన్ని పీఎంవో కార్యాలయం ట్వీట్‌ చేసింది. గురువారమే అధికారికంగా ఎయిరిండియాను అప్పగించే ప్రక్రియ పూర్తి అయింది. ఎయిరిండియా బోర్డు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా కార్యకలాపాలను సజావుగా కొనసాగించేందుకు టాటా సన్స్‌కు రుణాలు ఇచ్చేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియం అంగీకరించింది. ఎయిర్‌లైన్‌ నిర్వహణకు కావాల్సినంత మేర టర్మ్‌ లోన్స్‌, వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్లను అందించేందుకు కన్సార్టియం సూచనప్రాయంగా ఆమోదం తెలిపిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ కన్సార్టియంలో ఉన్నాయి. టాటా గ్రూప్‌ నుంచి ఎయిరిండియాను తీసుకున్న 69 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ సంస్థకే ప్రభుత్వం అప్పగించింది. ప్రభుత్వం నిర్వహించిన వేలం ప్రక్రియ ద్వారా ఎయిరిండియాను టాటా గ్రూపు అనుబంధ సంస్థ ట్యాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గతేడాది అక్టోబరు 8న రూ.18వేల కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.15,300 కోట్లను రుణాల రూపంలో, మిగిలిన రూ.2,700 కోట్లు నగదు రూపంలో టాటాలు కేంద్రానికి చెల్లించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img