Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ట్విట్టర్‌కు షాకిచ్చేందుకు ఉద్యోగుల రెడీ.. కంపెనీ వీడనున్న వందలాదిమంది!

మస్క్‌ అల్టిమేటంతో ఉద్యోగుల కఠిన నిర్ణయం
ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ చేతికి ట్విట్టర్‌ చిక్కిన తర్వాత సంస్థలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు ప్రకటించిన మస్క్‌ వారిని అభద్రతాభావంలోకి నెట్టేశారు. మరోవైపు, బ్లూటిక్‌ కోసం డబ్బులు వసూలు చేస్తామన్న ప్రకటన యూజర్లను అయోమయానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్‌ ఉద్యోగులు కొందరు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంస్థకు గుడ్‌బై చెప్పాలని వందలాదిమంది నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కువ గంటలు పనిచేయాలని, లేదంటే సంస్థను వదులుకోవాలన్న మస్క్‌ అల్టిమేటం నేపథ్యంలోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వర్క్‌ ప్లేస్‌ యాప్‌ ‘బ్లైండ్‌’ నిర్వహించిన పోల్‌లో 180 మంది ఉద్యోగుల్లో 42 శాతం మంది సంస్థను వదిలివెళ్లేందుకే మొగ్గు చూపారు. పావువంతు మంది మాత్రం అయిష్టంగానే కొనసాగేందుకు ఇష్టపడగా 7 శాతం మంది సంస్థను అంటిపెట్టుకుని ఉండేందుకే ఓటు వేశారు. సంస్థలో ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు ఉద్యోగులను కలిసిన మస్క్‌ వారిని సంస్థలో ఉండమని ఒప్పించేందుకు ప్రయత్నించినట్టు ఇటీవల సంస్థను వీడి ఉద్యోగులతో టచ్‌లో ఉన్న మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు. కంపెనీని అంటిపెట్టుకుని ఉండేది ఎందరన్న విషయంలో స్పష్టత లేకున్నప్పటికీ, తొందరపడి ఉద్యోగులను తొలగించాలనుకోవడం, ఎక్కువ పనిగంటలు పనిచేసేలా ఒత్తిడి తీసుకురావడం వంటి కారణాలతో కంపెనీలో కొనసాగేందుకు ఎక్కుమంది ఉద్యోగులు విముఖత చూపుతున్నారు. ఉద్యోగులు పెద్దమొత్తంలో కంపెనీని వీడాలనుకుంటున్నట్టు వార్తలు రావడంతో సోమవారం వరకు కార్యాలయాలను మూసివేసి బ్యాడ్జ్‌ యాక్సెస్‌ తగ్గించనున్నట్టు కంపెనీ నుంచి ఉద్యోగులకు సమాచారం అందింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img