మార్చురీ నుంచి కుమారుడి డెడ్బాడీని ఇచ్చేందుకు అక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగి రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో తల్లిదండ్రులు భిక్షాటన చేశారు. ఇల్లు ఇల్లు తిరుగుతూ జోలె పట్టి అడుక్కున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. బీహార్లోని ముశ్రీఘర్హార్ పోలీసు స్టేషన్ పరిధిలో జూన్ 6న ఓ మానసిక వికలాంగుడు అదృశ్యమయ్యాడు. స్థానికంగానే ఆ బాలుడు చనిపోయి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. 7వ తేదీన పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమస్తిపూర్ సదార్ హాస్పిటల్కు తరలించారు. అయితే అక్కడ పోస్టుమార్టం అనంతరం.. డెడ్బాడీని అప్పగించాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని ఓ ఉద్యోగి డిమాండ్ చేశాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ బాలుడి తల్లిదండ్రులు జోలె పట్టి అడుక్కున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. సమస్తిపూర్ సదార్ హాస్పిటల్ ఉన్నతాధికారులకు వీడియోలు చేరడంతో వారు స్పందించారు. తక్షణమే బాలుడి డెడ్బాడీని అతని ఇంటికి పంపించేశారు. ఈ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి, విచారణ జరుపుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. విచారణ అనంతరం లంచం డిమాండ్ చేసిన ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మార్చురీలో పని చేసే ఉద్యోగి గతంలో కూడా లంచం డిమాండ్ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి.