సీపీఐ, రైతు సంఘాల ప్రతినిధి బృందం డిమాండు
డోన్ : కర్నూలు జిల్లాలోని హంద్రీనీవా ప్రధాన కాలువకు ఎడమవైపున గల 68 చెరువులకు త్వరతగతిన నీరందిచాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు, ఏపీ రైతుసంఘం కర్నూలు జిల్లా కార్యదర్శి కె.జగన్నాథం డిమాండు చేశారు. జిల్లాలో చెరువులకు నీరందించాలని కోరుతూ ఏపీ రైతుసంఘం, సీపీఐ అధ్వర్యంలో జీపుజాతాను కృష్ణగిరి మండలం పులిచెర్ల దగ్గర కె.రామాంజనేయులు శనివారం ప్రారంభించారు. పులిచెర్ల కొండపై గల పంపింగ్ పాయింట్ను పరిశీలిం చారు. యాపదిన్నె చెరువు, అబిరెడ్డిపల్లి చెరువు, ఉడుములపాడు చెరువు, జగదుర్తి చెరువును కె.రామాంజనేయులు, కె.జగన్నాథం, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్బాబు, సీపీఐ డోన్ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, ఏఐటీ యూసీ జిల్లా అధ్యక్షుడు సుంకయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీకాంత్, బొంతిరాళ్ల సర్పంచ్ రవి మోహన్, రైతుసంఘం నియోజకవర్గ కార్యదర్శి సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి వరదరాజులు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి అబ్బాస్తో కూడిన సీపీఐ, రైతుసంఘం ప్రతినిధి బృందం పరిశీలించింది. కె.రామాంజనేయులు మాట్లాడుతూ కరువు కాటకాలకు నిలయంగా రాయలసీమ జిల్లాలు మారాయని, అప్పట్లో సీపీఐ, ప్రజా సంఘాల ఉద్యమాల ఫలితంగా హంద్రీనీవా కాలువను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేపట్టారన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పేరుతో హంద్రీనీవా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, రాయలసీమకు కృష్ణాజలాలు మళ్లించాలని సీపీఐ, అనుబంధ సంఘాల పోరాట ఫలితంగా హంద్రీ-నీవా కాలువను పూర్తి చేశారన్నారు. కళ్ల ముందు నీళ్లు పోతున్నా వాటిని వాడుకోలేని దుస్థితి ఉందని, నాలుగేళ్ల నుంచి హంద్రీ-నీవా ప్రధాన కాలువల ద్వారా నీరు సమృద్ధిగా పొంగి ప్రవహిస్తున్నదన్నారు. జిల్లాలో 106 చెరువులు నింపిపుతామని హామీ ఇచ్చి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. 106 చెరువుల నుంచి మొదటి విడతగా 68 చెరువులు నింపుతామని ఈ ప్రభుత్వం చెప్పి రెండేళ్లు పూర్తి చేసుకున్నా ఇంతవరకు పనులు జరగలేదని మండి పడ్డారు. చెరువులకు నీరందించే పనులు కేవలం 53 శాతం మాత్రమే జరిగాయన్నారు. మిగిలిన పనులు త్వరగా జరిగేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేయాలన్నారు. జగన్నాథం మాట్లాడారు. ఏపీ రైతుసంఘం నియోజకవర్గ గౌరవాధ్యక్షుడు చిన్న రంగన్న, కృష్ణగిరి మండల కార్యదర్శి ఖలీల్, సీపీఐ నాయకులు గౌండా బాష, శివన్న లక్ష్మన్న, వెంకట రాముడు, నారాయణ, రజాక్, పుల్లయ్య, ప్రభాకర్, టీడీపీ నాయకులు కృష్ణారెడ్డి, రవి, మాబాష, చిన్నలింగప్ప పాల్గొన్నారు.