తమిళనాడు తంజావూరులో ఘోర ప్రమాదం జరిగింది. కరిమేడు అప్పర్ ఆలయ రథం ఊరేగింపులో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది సజీవదహనం అయ్యారు.మరో 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో చిన్నారులు కూడా ఉన్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రథోత్సవంలో పాల్గొన్న రథం గుడికి తిరిగి వస్తుండగా హై టెన్షన్ విద్యుత్ తీగలకు రథం తాకడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి భక్తులు సజీవ దహనం అయ్యారని స్థానిక పోలీసులు జాతీయ మీడియా ఏఎన్ఐకి తెలిపారు.బుధవారం వేకువజామున ఈ విషాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
రథోత్సవంలో షార్ట్ సర్క్యూట్ జరిగి 11 మంది భక్తులు సజీవదహనం కావడంతో ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి అందజేస్తామని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.