శివానంద ఆశ్రమం భూముల్లో మంత్రి శంకుస్థాపన
అడ్డుకున్న ఆర్ఎస్ఎస్, సామాజిక సామరత సంస్థ, యువ మోర్చా నేతలు
రెండు వర్గాల తోపులాట.. ఏడుగురి అరెస్ట్
విశాలాంధ్ర`తాడేపల్లిగూడెం టౌన్ : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివానంద ఆశ్రమానికి చెందిన భూమిలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, శ్రీనివాస్ దంపతులను సామాజిక సామరత రాష్ట్ర నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మీ, ఆర్ఎస్ఎస్ నాయకులు కణుపూరి దామోదర, సామాజిక సామరసత, మహిళా మోర్చానేతలు అడ్డుకున్నారు.
అసలు విషయమేంటంటే..
స్థానిక సుబ్బారావుపేటలోని శివానంద ఆశ్రమ ఆధ్యాత్మిక కేంద్రానికి 1940లో భక్తులు కనుపూరి కుటుంబీకులు స్థానిక జవ్వలపాలెం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న 25సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చారు. ఆశ్రమ నిర్వాహణ, పరిరక్షణ బాధ్యత సీనియర్ న్యాయవాది బండారు మనోహర్ కుటుంబం నిర్వహిస్తోంది. నాటి నుంచి ఆధ్యాత్మికవేత్త బండి రామస్వామి ఆశ్రమ స్వామిజీగా కొనసాగారు. ఆయన కన్నుమూసిన తదుపరి ఆయన సమాధిని జవ్వలపాలెం ఆశ్రమం వద్దే ఏర్పాటు చేయాలనేది నిర్వాహకుల ఆలోచన.
అభ్యంతరాలు ఇవీ..
ఇందుకోసం శంకుస్థాపన చేయాలని సంకల్పించి దీనికి శనివారం ముహూర్తం పెట్టారు. అయితే ఈ కార్యక్రమానికి సామాజిక సామరసత, ఆర్ఎస్ఎస్ నాయకులు అభ్యంతర తెలిపారు. ఆశ్రమ భూమిలో శంకుస్థాపన కార్యక్రమం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్`మంత్రి వర్గీయుల మధ్య వాగ్వివాదం జరిగింది. జై శ్రీరామ్, సీఎం డౌన్ డౌన్, ఆలయ, ఆశ్రమ భూములను పరిరక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆశమ్ర నిర్వాహకులు, న్యాయవాది బండారు మనోహర్ మాట్లాడుతూ ఈ భూమి తమ ఆశ్రమానికి 1940లో దాతలు విరాళంగా ఇచ్చారని, ఆశ్రమాన్ని తమ కుటుంబం నిర్వహిస్తోందని చెబుతూ సంబంధిత దస్తావేజులను చూపించారు. అయినా దీనిపై తమకు సర్వహక్కులు ఉన్నాయని, సంబంధించిన డాక్యుమెంట్ కూడా తమ వద్ద ఉన్నాయని మంత్రి వనిత చెప్పారు. దీనిపై మనోహర్ మాట్లాడుతూ ఎనిమిది దశాబ్దాలుగా ఉన్న ఆశ్రమ భూమిని కొంతమంది క్రయవిక్రయాలు జరిపారని, దీనిని విక్రయించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని విరమించాలని డిమాండ్ చేశారు.
ఆదిలక్ష్మి సహా ఏడుగురి అరెస్ట్
ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సామాజిక సమరసత రాష్ట్ర నేత భోగిరెడ్డి ఆదిలక్ష్మి, ఆర్ఎస్ఎస్ నాయకులు కణుపూరి దామోదర, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు తాదాల సూర్య కుమారి, ఉపాధ్యక్షురాలు ధనుకొండ విజయలక్ష్మి, కార్యదర్శి ఎల్లపు విజయ సారధి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అడపా రమేష్, యువ మోర్చా జిల్లా నాయకులు వెన్నెంరెడ్డి నవీన్, న్యాయవాది బండి రామస్వామిలను సీఐ ఆకుల రఘు తమ సిబ్బందితో బలవంతంగా అరెస్టు చేసి తాడేపల్లిగూడెం పట్టణ పోలీసుస్టేషన్కు తరలించారు. దీనిపై మంత్రి తానేతి వనిత దంపతులు మాట్లాడుతూ తాము 2014లో ఈ స్థలాన్ని కొనుగోలు చేశామని, దీనికి సంబంధించిన 30 సంవత్సరాల పూర్వపు దస్తావేజులున్నాయని చెప్పారు. ఆశ్రమానికి హక్కులు ఉన్నట్లయితే కోర్టు ద్వారా తేల్చుకోవచ్చునన్నారు. తమపై రాజకీయంగా బురద జల్లెందుకే ఈ విధంగా శంకుస్థాపనను అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.