మోదీ సర్కారుపై తిరగబడదాం
భారత్బంద్ను జయప్రదం చేయండి
సీపీఐ జన ఆందోళన్ పాదయాత్రలో నేతల పిలుపు
విజయనగరం :మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో దేశాన్ని తిరోగమనం బాట పట్టిస్తోందని, త్యాగాలు, ఉద్యమాలతో ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థలను తన మిత్రులు అదానీ, అంబానీలకు కారుచౌకగా కట్టబెడుతోందని సీపీఐ రాష్ట్ర నేతలు నిశితంగా విమర్శించారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలకు, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సమష్టి పోరాటాలు అవశ్యమని పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో ప్రారంభమైన సీపీఐ జన ఆందోళన్ పాదయాత్ర రెండో రోజు విజయనగరంలో కొనసాగింది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మోదీ సర్కారు కళ్ల్లు తెరిపించడానికి సీపీఐ జన ఆందోళన్ కార్యక్రమం చేపట్టిందని, దీనిద్వారా రాష్ట్రంలో పాదయాత్రలు చేపట్టి ప్రజలను చైతన్య వంతం చేస్తున్నామన్నారు. దిల్లీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కళ్లకు కనిపించ డం లేదన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి, రైతులను కూలీలుగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం మూడు నల్లసాగు చట్టాలు తీసుకొచ్చిం దని విమర్శించారు. ప్రాణత్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ప్లాంట్ను అడ్డగోలుగా అమ్మేస్తోందని ఆగ్రహం వెలిబుచ్చారు. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతి రేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు 27న భారత్ బంద్ చేపడుతున్నామని, దేశంలోని 19 పార్టీలు బంద్లో పాల్గొంటున్నాయన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పోరాడి సాధించు కున్నామన్నారు. రూ.5 వేల కోట్ల పెట్టుబడితో సంస్థ ప్రారంభమైందని, ఇప్పటి వరకు రూ.42 వేల కోట్లు ప్రభుత్వానికి చెల్లించిందన్నారు. 62 గ్రామాల ప్రజలు వేలాది ఎకరాలు స్టీల్ప్లాంట్ కోసం ఇచ్చారన్నారు. ఎకరాకు రూ.12 వేలు చెల్లించి అతి తక్కువ ధరకు భూములు తీసుకుం దన్నారు. ఇప్పటికీ 8 వేల మంది నిర్వాసితులున్నారన్నారు. రిజర్వేషన్లకు స్వస్తి చెప్పాలన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలో భాగంగానే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని దునుమాడారు. గంగవరం పోర్టులో 10 శాతం ప్రభుత్వ వాటా ఉందని, పీఓటీ విధానం కింద 30 ఏళ్లకు లీజుకిచ్చార న్నారు. అందువల్ల 30 ఏళ్ల తర్వాత గంగవరం పోర్టు తిరిగి ప్రభుత్వ పరమవుతుందన్నారు. అయితే పోర్టులో మిగిలిన 10 శాతం కూడా అమ్మకానికి పెట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గంగవరం పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్ మాట్లాడుతూ మోదీ అధికారం చేపట్టిన తర్వాత విభజన రాజకీయాలు పెరిగాయన్నారు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ…ప్రజల సొమ్మును కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. దీనివల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు రావన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 21న విశాఖపట్నంలో పాదయాత్ర ముగింపు సభ జరుగుతుందన్నారు. సభను జయప్రదంచేయాలని విజ్ఞప్తి చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శులు బుగత అశోక్, అలమండ ఆనందరావు, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్ రామచంద్రరావు, గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు దొర, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు టి జీవన్, కోశాధికారి ఎస్ రంగరాజు, నాయకులు మారయ్య, మురళీధరరావు, అగ్రిగోల్డ్ అసోసియేషన్ జిల్లా నాయకులు మజ్జి సూరప్పడు, ఈవీ నాయుడు, ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ సభ్యులు పి సురేష్, ఎం శేఖర్, ఎం భీమేశ్వరరావు పాల్గొన్నారు.