తెలంగాణలో తొలిసారిగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు మీడియాకు వెల్లడిరచారు. కెన్యా జాతీయురాలి వయసు 24 ఏండ్లు కాగా, సోమాలియా దేశస్థుడి వయసు 23 ఏండ్లు అని పేర్కొన్నారు. 12వ తేదీనే వీరిద్దరి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్స్కు పంపామని, నిన్న రాత్రి ఫలితాలు వచ్చాయన్నారు. వీరిద్దరూ కూడా మొహదీపట్నం, టోలీచౌకీలో ఉన్నారు. బాధిత మహిళను గచ్చిబౌలిలోని టిమ్స్కు తరలించామని చెప్పారు. మరోక వ్యక్తిని మరికొద్ది గంటల్లో టిమ్స్కు తరలిస్తామని తెలిపారు. వీరి కుటుంబ సభ్యులకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామన్నారు.ఇక మూడో వ్యక్తికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారించబడ్డాడు. అతని వయసు ఏడేండ్లు మాత్రమే. ఈ బాలుడి పశ్చిమ బెంగాల్కు చెందిన వాడు. శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన వెంటనే కోల్కతాకు వెళ్లాడని, రాష్ట్రంలోకి ప్రవేశించలేదని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని ఆ రాష్ట్ర అధికారులకు చేరవేసినట్లు డీహెచ్ తెలిపారు. ఇక నాన్రిస్క్ ప్రాంతాల నుంచి వచ్చే వారికి పరీక్షలను పెంచుతున్నామని చెప్పారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి ఒమిక్రాన్ వచ్చిన ఒకరు పారిపోయారనే వార్తల్లో వాస్తవం లేదని వివరించారు. థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డీహెచ్ వివరించారు. ఒమిక్రాన్ గాలి ద్వారా వేగంగా సోకుతోందని..చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. రెండు రోజుల్లోనే డబుల్ అయ్యే సామర్థ్యం ఉందని వెల్లడిరచారు. ఈ కొత్త వేరియంట్ సోకిన వారికి చాలా స్వల్ప లక్షణాలే ఉన్నాయన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.