ఎనిమిది హైకోర్టులకు పేర్లు సిఫార్సు చేసిన కొలీజియం
న్యూదిల్లీ :
రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలను నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టు కొలీజి యం ఎనిమిది మంది పేర్లను సిఫార్సు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు (సీజేలు) కూడా ఉన్నారు. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య కొలీజియం సిఫార్సు చేసిన పేర్లలో కలకత్తా హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రాజేశ్ బిందల్ ఒకరుగా ఉన్నారు. దీనిపై గురు, శుక్రవారాల్లో కొలీజియం సమావేశమైంది. త్రిపుర హైకోర్టు సీజే అఖిల్ ఖురేషి సహా ఐదుగురు సీజేలు, 28 మంది ఇతర హైకోర్టుల జడ్జీల బదిలీలకు సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య రాజకీయ వివాదాల నేపథ్య తీర్పుల కారణంగా కలకత్తా హైకోర్టు జస్టిస్ బిందల్ వార్తల్లో నిలిచారు. దేశంలోని హైకోర్టు జడ్జీల్లోనే సీనియర్ మోస్ట్ అయిన జస్టిస్ ఖురేషిని గుజ రాత్ హైకోర్టుకు పంపినప్పటికీ సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి దక్కకపోవడంతో ఆయన పేరు కూడా వార్తల్లో వినిపించింది. అలహాబాద్, కలకత్తా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మేఘాలయ, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల హైకోర్టులకు చీఫ్ జస్టిస్లుగా పదోన్నతి పొందే జడ్జీల పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ ఖురేషిని రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసినట్లు వర్గాలు వెల్లడిరచాయి. ఈ ఏడాది ఏప్రిల్లో సీజేఐగా జస్టిస్ రమణ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వేర్వేరు హైకోర్టుల కోసం దాదాపు వంద పేర్లను సిఫార్సు చేశారన్నాయి. దేశంలో మొత్తం 25 హైకోర్టులకు 1,080 జడ్జీలు ఉండాలి. కానీ కేవలం 420 మంది జడ్జీలతో పనిచేస్తున్నాయి. ఐదుగురు చీఫ్ జస్టిస్ల బదిలీతో పాటు 28 మంది హైకోర్టు జడ్జీలను ఇతర హైకోర్టులకు పంపాలని కొలీజియం సమావేశంలో నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే అరూప్ కుమార్ గోస్వామిని చత్తీస్గఢ్ హైకోర్టుకు, మధ్యప్రదేశ్ హైకోర్టు సీజే మహమ్మద్ రఫీక్ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు, రాజస్థాన్ హైకోర్టు సీజే ఇంద్రజీత్ మహంతిని త్రిపుర హైకోర్టుకు, మేఘాలయ హైకోర్టు సీజే బిశ్వనాథ్ సోమందర్ను సిక్కిం హైకోర్టుకు పంపాలని కొలీజియం నిర్ణయించినట్లు తెలిపాయి. జస్టిస్ బిందల్తో పాటు జస్టిస్ ప్రకాశ్ శ్రీవాత్సవ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ రితూ రాజ్ అవస్థి, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ రంజిత్ వి మోరే, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఆర్వీ మలిమాథ్లను వేర్వేరు హైకోర్టు చీఫ్ జస్టిస్లుగా నియమించేలా కొలీజియం సిఫార్సు చేసినట్లు పేర్కొన్నాయి. కలకత్తా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక హైకోర్టుల చీఫ్ జస్టిస్లుగా జస్టిస్ ప్రకాశ్ శ్రీవాత్సవ, ప్రశాంత్ కుమార్ మిశ్రా, రితు రాజ్ అవస్తీలను నియమించాలని కొలీజియం సిఫార్సు చేసినట్లు తెలిపాయి. అలాగే, తెలంగాణ, మేఘాలయ, గుజరాత్, మధ్యప్రదేశ్ హైకోర్టుల చీఫ్ జస్టిస్లుగా న్యాయమూర్తులు సతీశ్ చంద్ర శర్మ, రంజిత్ వి మోరే, అరవింద్ కుమార్, ఆర్వీ మలిమాథ్ల పేర్లను సిఫార్సు చేసినట్లు వెల్లడిరచాయి. దేశంలోని 12 హైకోర్టులకు ఏకకాలంలో 68 పేర్లను సిఫార్సు చేసే చరిత్రాత్మక నిర్ణయం నేపథ్యంలో తాజా పరిణామం ప్రాముఖ్యతను సంతరించుకుంది. కర్ణాటక హైకోర్టు శాశ్వత జడ్జీలుగా నియమించేందుకు పది పేర్లను ఇటీవల కొలీజియం సిఫార్సు చేయడం విదితమే. ఈ మేరకు సిఫార్సులను రాష్ట్రపతికి పంపగా ఆయన ఆమోదంతో కొత్త న్యాయమూర్తులు నూతన బాధ్యతలు చేపడతారు.