రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలన్నదే నా తాపత్రయం
సమగ్రమైన, మెరుగైన బిల్లుతో మళ్లీ ముందుకొస్తాం : సీఎం జగన్
కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా ప్రకటన చేశారు. ఏ పరిస్థితుల్లో 3 రాజధానులు తీసుకువచ్చిందీ బుగ్గన వివరించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ, అమరావతి ప్రాంతమంటే వ్యతిరేకత లేదని, నా ఇల్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతమంటే నాకు ప్రేమ అని చెప్పారు. రాష్ట్రమంతా అభివృద్ది చెందాలన్నదే తన తాపత్రయమన్నారు. రాజధాని ప్రాంతం అటు గుంటూరు, విజయవాడలో లేదన్నారు. అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున 50 వేల ఎకరాలకు లక్ష కోట్లు అని చెప్పారు. ఈ ఖర్చు తాజా లెక్కల ప్రకారం అవుతుంది. పదేళ్ల తర్వాత లక్షల కోట్ల విలువ ఆరేడు లక్షల కోట్లు అవుతుందని అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే..రాజధాని ఊహాచిత్రం ఎలా సాధ్యమవుతుంది. ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. మనకు, మన పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి? పెద్ద నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖ అని, అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. ఇంకొన్ని జమ చేస్తే.. వైజాగ్.. హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో పోటీ పడే పరిస్థితి ఉంటుందన్నారు. వాస్తవాలను గుర్తెరిగే.. అన్ని ప్రాంతాల అభివృద్ది గురించి మూడు రాజధానులు బిల్లును తీసుకొచ్చామని చెప్పారు. బిల్లు వచ్చినప్పటి నుంచి.. అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్తే.. ఇప్పటికి ఫలాలు అందుతూ ఉండేవన్నారు. కానీ ఆ పరిస్థితుల లేనందున మూడు రాజధానులపై.. సమగ్రమైన బిల్లును తీసుకొస్తామన్నారు. ఇంతకు ముందు బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. విసృత, విశాల ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి, సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకువస్తుందని సీఎం వివరించారు.