కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకా ఒక్కో డోసు ధర రూ. 275 ఉండే అవకాశం
సర్వీసు చార్జీ పేరుతో అదనంగా మరో రూ. 150 వసూలు
కరోనా టీకాలు కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల బహిరంగ మార్కెట్ ధరలు ఖరారైనట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది.ఈ సమయంలో కోవిషీల్డ్ కోవాగ్జిన్ టీకాల కంపెనీలు, రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఈ రెండు కొవిడ్ వ్యాక్సిన్ల ధరలు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టీకాల ఒక్కో డోసు ధర రూ. 275 వరకు ఉండొచ్చని సమాచారం. సర్వీసు చార్జీల రూపంలో మరో రూ. 150 అదనంగా వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ ధర ఒక డోస్కు 1200 రూపాయలుగా ఉండగా, కోవిషీల్డ్ ధర 780గా ఉంది. వీటికి అదనంగా 150 రూపాయలు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ రెండు కూడా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అనుమతులు ఉన్న వ్యాక్సిన్లే. అయితే, ఒకవేళ వ్యాక్సిన్కు మార్కెట్ ఆథరైజేషన్ లేబుల్ దక్కితే కేవలం అత్యవసర పరిస్థితులు, రిజర్వ్డ్ కండిషన్స్లో మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండదు. ఇక రెగ్యులర్ మార్కెట్లోకి ఈ టీకాలు వస్తే, వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని నిపుణులు. అభిప్రాయపడుతున్నారు.