విద్యుత్ వినియోగం పెరుగుదలే కారణం
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ
న్యూదిల్లీ : విద్యుత్ డిమాండ్ పెరగడం వల్ల థర్మల్ బొగ్గుకు డిమాండ్ పెరుగుతుందని, ఉత్పత్తిని పెంపొందించడానికి బొగ్గు బ్లాక్ కేటాయింపుదారులకు సువర్ణావకాశం ఉందని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు కొరత ఏర్పడినట్లు సమాచారం. వాణిజ్య మైనింగ్ కోసం కొత్త బొగ్గు బ్లాకులు కేటాయింపు జరిగింది. కాబోయే బిడ్డర్ల నుంచి ఈ బ్లాకులకు ప్రోత్సాహకరమైన స్పందన లభించింది. వీటిలో కొన్ని బ్లాక్లు కేటాయించిన ఏడాదిలోపే బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ప్రస్తుతం దిగుమతి చేసుకున్న బొగ్గు ధర చాలా ఎక్కువగా ఉన్నందున బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు బొగ్గు బ్లాక్ కేటాయింపుదారులకు సువర్ణావకాశం ఉంది. దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడం వల్ల థర్మల్ బొగ్గుకు డిమాండ్ పెరుగుతుంది’ అని బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ జైన్ తెలిపారు. క్యాప్టివ్ బొగ్గు బ్లాకుల ఉత్పత్తి 2022 ఆర్థిక సంవత్సరంలో 35 శాతం పెరిగి 85 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2021 ఆర్థిక సంవత్సరంలో 63 మిలియన్ టన్నులుగా ఉంది. ‘నామినేటెడ్ అథారిటీ అయిన బొగ్గు మంత్రిత్వ శాఖ 2022-23 ఆర్థిక సంవత్సరంలలో బొగ్గు బ్లాక్లు ఉత్పత్తిని ప్రారంభించిన లేదా ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉన్న క్యాప్టివ్ బొగ్గు బ్లాకుల కేటాయింపులతో బొగ్గు ఉత్పత్తిని సమీక్షించింది’ అని ఆ ప్రకటన పేర్కొంది. జైన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. క్యాప్టివ్ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ స్థిరమైన కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం, బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనలు) చట్టం, 2015 ప్రకారం 106 బొగ్గు బ్లాకులను కేటాయించారు. 47 గనులకు గనుల ప్రారంభ అనుమతులు మంజూరయ్యాయి. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో 60 బొగ్గు బ్లాకులకు పెరిగే అవకాశం ఉంది. కార్యాచరణ బొగ్గు బ్లాకుల వార్షిక గరిష్ఠ స్థాయి సామర్థ్యం సుమారు 230 మిలియన్ టన్నులు ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పొడి ఇంధన ఉత్పత్తి గణనీయంగా 140 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. గత ఏడాది అక్టోబర్లో అనేక రాష్ట్రాలు విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కొరత గురించి ఫిర్యాదు చేశాయి. వాటిలో కొన్ని రోజుకు చాలా గంటలు విద్యుత్తు అంతరాయాన్ని కూడా ఎదుర్కొన్నాయి.