తగ్గనున్న కోటి టన్నుల బియ్యం ఉత్పత్తి
ఈ ఏడాది ఖరీఫ్లో 15 శాతంతగ్గిన వరి సాగు
మొన్నటి వరకు గోధుమదిగుబడిలో క్షీణత
కేంద్ర విధానాలతో ప్రధాన ఆహార పంటలకు దెబ్బ
న్యూదిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పాలకుల అస్తవ్యస్థ విధానాలకు తోడు తీవ్రమైన వాతావరణ పరిస్థితులూ దేశవ్యాప్తంగా ఆహార పంటల దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా పేదలు ఆకలితో అల్లాడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రధాన ఆహార పంటలుగా ఉన్న గోధుమ, వరి దిగుబడులు రోజురోజుకు పడిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. గత ఆర్థిక సంవత్సరంలో గోధుమ దిగుబడి పడిపోగా, 2022-23లో దాదాపు కోటి టన్నులకుపైగా బియ్యం ఉత్పత్తి పడిపోతుందని ఆహార రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా వరి సాగు గణనీయంగా తగ్గిందని తెలిపారు. గత ఏడాది ఖరీఫ్తో పోల్చితే ఈ సీజన్లో వరి సాగు 13 శాతం తగ్గుదల నమోదయింది. కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, గత ఖరీఫ్లో 3.14 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేయగా, ఈ ఏడాది ఖరీఫ్లో అది 2.74 కోట్ల హెక్టార్లకు తగ్గింది. అంటే, ఈ ఆర్థిక సంవత్సరం బియ్యం ఉత్పత్తి గణనీయంగా పడిపోతుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ‘విత్తనాలు వేసే కాలం దాదాపు ముగిసింది. ఒకవేళ నాట్లు వేయటం ఇప్పుడు మొదలైనా, మనకున్న సమాచారం ప్రకారం వరి దిగుబడి నామమాత్రంగా ఉండనున్నది’ అని వ్యవసాయ పరిశోధన సంస్థ ‘ఐగ్రెయిన్’ డైరెక్టర్ రాహుల్ చౌహాన్ అన్నారు. వరి అత్యధికంగా సాగుచేసే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, చత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో సాగు తగ్గిందని సమాచారం. ఉత్తరప్రదేశ్లో వరి ప్రధాన పంటగా ఉన్న జిల్లాల్లో వర్షాభావం పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు 8 నాటికి వాయువ్య యూపీలో సాధారణంగా కన్నా 36 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. ఈశాన్య యూపీలో 43 శాతం, బీహార్లో 38 శాతం, జార్ఖండ్లో 45 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. అలాగే పశ్చిమ బెంగాల్ సాధారణంగా 46 శాతం తక్కువ వర్షం కురిసింది. బియ్యం ఉత్పత్తికి సంబంధించి 2021-22 ఖరీఫ్లో దాదాపు 13 కోట్ల టన్నుల ఉత్పత్తి రాగా, ఇందులో 2.12 కోట్ల టన్నులు ఆయా దేశాలకు ఎగుమతి అయింది. ఈ ఏడాది జులై 1 నాటికి ప్రభుత్వ గోడౌన్లలో 4.7 కోట్ల టన్నుల బియ్యం నిల్వలున్నాయి. మనదేశంలో ప్రధాన ఆహార పంటలయిన గోధుమ, బియ్యం ఉత్పత్తి క్రమంగా దెబ్బతినటం ఆందోళన కలిగించే అంశం. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా గోధుమ సేకరణ గణనీయంగా తగ్గింది. క్రితం ఏడాదితో పోల్చితే 2021-22లో గోధుమ కొనుగోళ్లు 56 శాతం తగ్గాయి. దీంతో ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో రేషన్ దుకాణాల్లో గోధుమ స్థానంలో బియ్యాన్ని పంపిణీ చేయాల్సి వచ్చింది.
ఇది అణగారిన, పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కోట్లాది మంది కుటుంబాల్లో పిల్లలు, పెద్దలు పోషకాహారానికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. బియ్యం, గోధుమ దిగుబడి, సేకరణ… మనదేశ ఆహార భద్రతతో ముడిపడిన అంశం. వీటి సాగు పడిపోకుండా కేంద్రం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవలసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.