Friday, April 19, 2024
Friday, April 19, 2024

దిగొచ్చిన ప్రభుత్వం

అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం జగన్‌
పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని వెల్లడి
ఇందుకోసం సమగ్ర బిల్లుతో మళ్లీ సభ ముందుకొస్తామని ప్రకటన

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : రాజు ఎంత మొండివాడైనా రైతన్న కన్నెర్ర చేస్తే తలవంచక తప్పదని మరోసారి రుజువైంది. దిల్లీ పొలిమేరల్లో ఏడాది కాలంగా అన్నదాతలు నిర్వహిస్తున్న చరిత్రాత్మక ఉద్యమానికి తలొగ్గి మూడు రోజుల క్రితం సాగు చట్టాల రద్దుకు ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోగా, అదే తరహాలో అమరావతి రాజధాని కోసం గత 706 రోజులుగా అవిశ్రాంత పోరు సాగిస్తున్న రైతన్నల ఉద్యమానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి కూడా తలొగ్గక తప్పలేదు. పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం హైకోర్టులో దీనిపై రోజువారీ విచారణ జరుగుతుండగా, వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను రాష్ట్ర మంత్రివర్గం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ హైకోర్టుకు తెలిపారు. ఆ మేరకు ఆయన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వివరాలను నివేదించారు. దీనిపై న్యాయస్థానం స్పష్టత కోరగా అసెంబ్లీలో సీఎం ప్రకటన అనంతరం పూర్తి వివరాలు అందజేయగలనని ఏజే చెప్పారు. దీంతో వచ్చే సోమవారానికి ధర్మాసనం ఈ కేసు విచారణను వాయిదా వేయగా, ముఖ్యమంత్రి మధ్యాహ్నాం 3 గంటలకు దీనిపై సభలో కీలక ప్రకటన చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశమన్నారు. దానికోసమే ప్రస్తుతం పాలనావికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటున్నామన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామని స్పష్టం చేశారు. ‘ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. గుంటూరులో హైకోర్టు ఉండేది. శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం రాయల సీమకు న్యాయం చేయాల్సి ఉంది. 1956లో కర్నూలు నుంచి రాజధానిని, గుంటూరు నుంచి హైకోర్టును హైదరాబాద్‌కు తీసుకుపోయారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతమంటే నాకు వ్యతిరేకత లేదు. నా ఇల్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతమంటే నాకు ప్రేమ. ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున 50 వేల ఎకరాలకు లక్ష కోట్లు అవుతుందని గత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఖర్చు తాజా లెక్కల ప్రకారం అవుతుంది. పదేళ్ల తర్వాత ఈ లక్ష కోట్ల విలువ ఆరేడు లక్షల కోట్లు అవుతుంది. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే రాజధాని ఊహాచిత్రం ఎలా సాధ్యమవుతుంది. ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసమేనా? మనకు, మన పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? పిల్లలందరూ పెద్ద నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం విశాఖ. అక్కడ అన్నీ వసతులు ఉన్నాయి. వాటికి అదనపు హంగులు అద్దితే, ఐదారేళ్ల తర్వాత అయినా హైదరాబాద్‌ వంటి నగరాలతో పోటీ పడే అవకాశం ఉంది. రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో పరిగెత్తాలనే తాపత్రయంతోనే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసనసభ, ఒకప్పటి రాజధాని అయిన కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి, తద్వారా ప్రజలకు మంచి చేయాలని ఈ ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ క్రమంలో ఏమేం జరిగాయో అన్నీ చూశాం. రకరకాలు అపోహలు సృష్టించారు. న్యాయపరంగా చిక్కులు ఎదురయ్యేలా చేశారు. ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రకటన చేయాల్సి వస్తోందని సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఆనాడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన వెంటనే, మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈరోజు దాని నుంచి మంచి ఫలితాలు ఈపాటికే అందుబాటులోకి వచ్చి ఉండేవి. నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక స్ఫూర్తితో వెనుకబడిన ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం. అందుకే వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టాం. గతంలో కేంద్రీకరణ ధోరణులను ప్రజలు ఎంత వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. మరోసారి హైదరాబాద్‌ లాంటి సూపర్‌ క్యాపిటల్‌ మోడల్‌ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసింది. అందుకే వికేంద్రీకరణే సరైన విధానమని నమ్మి అడుగులు వేశాం. అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలు, వీరందరి ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నది కాబట్టే ఈ రెండేళ్ల కాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లో మన ప్రభు త్వాన్ని మనసారా దీవించారు. అయితే, వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్ర చారాలు చేశారు. వికేంద్రీకరణ మంచిదని నమ్మి అడుగులు వేశాం. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని, మూడు రాజధానుల బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు చట్ట, న్యాయపరంగా అన్ని సమా ధానాలను బిల్లులోనే పొందు పరిచేందుకు, బిల్లులను మరింత మెరుగు పరిచేందుకు, విస్తృతంగా వివరించేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి సమగ్ర మైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకొస్తామని సీఎం జగన్‌ వివరించారు. ఆ మేరకు ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img