దిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ను ఓ వ్యక్తి వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని నగరంలో మహిళలకు లభిస్తున్న భద్రతను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఆమెను మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో 15 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లాడు. తీవ్ర దుమారం రేపిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు తాజాగా బయటకొచ్చాయి. ఇటీవల దిల్లీకి సమీపంలోని కంజావాలాలో ఓ 20 ఏండ్ల యువతిని నలుగురు దుండగులు కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకొని వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ నేపథ్యంలో దిల్లీలో మహిళ భద్రతను తనిఖీ చేసేందుకు స్వాతి మలివాల్ గురువారం తెల్లవారుజామున తన బృందంతో బయలుదేరారు. సుమారు 3గంటల ప్రాంతంలో దిల్లీ ఎయిమ్స్ బస్టాండ్ దగ్గర ఉండగా ఓ కారు వచ్చి ఆమె ముందు ఆగింది. వచ్చి కార్లో కూర్చో అని ఆ వ్యక్తి అడగ్గా.. ‘సారీ, వినిపించట్లేదు. నన్ను ఎక్కడ డ్రాప్ చేస్తావు. నేను మా ఇంటికి వెళ్లాలి. మా బంధువులు వస్తున్నారు’ అంటూ బదులిస్తుంది. దీంతో సదరు వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాసేపటి తర్వాత యూ టర్న్ తీసుకుని మళ్లీ వచ్చి స్వాతి మలివాల్ ముందు కారు ఆపి.. కారు ఎక్కమంటాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్వాతి మలివాల్.. ‘నన్ను ఎక్కడకు తీసుకెళ్లాలనుకుంటున్నావ్..? నువ్వు రావడం ఇది రెండో సారి. ఇలాంటివి వద్దని చెప్తున్నా’ అంటూ అతని వద్దకు వెళ్తుంది. ఈ క్రమంలో కారు కీ తీసుకునేందుకు చెయ్యి లోపలికి పెట్టగా.. సదరు వ్యక్తి వెంటనే కారు కిటికీ అద్దాన్ని పైకి లేపి.. ముందుకు పోనిస్తాడు. 15 మీటర్ల మేర స్వాతి మలివాల్ను అలాగే ఈడ్చుకొని వెళ్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు ఈ ఘటనపై ఢల్లీి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాపై విమర్శలు ఎక్కుపెడుతూ.. ఎల్జీ రాజకీయాలు పక్కనపెట్టి శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని సూచించారు. ‘బీజేపీ పాలనలో ఢల్లీిలో శాంతిభద్రతలకు ఏమైంది? గూండాలకు అంత ధైర్యం ఎలా వచ్చింది. నగరంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా సురక్షితంగా లేరు. శాంతిభద్రతల పరిరక్షణే ఎల్జీకి రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత. కొద్దిరోజులు ఆయన రాజకీయాలు పక్కన పెట్టి శాంతిభద్రతపై దృష్టి పెడితే మేము కూడా సహకరిస్తాం’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.