న్యూదిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొవిడ్ పరీక్షాకేంద్రాల వద్ద ప్రయాణికుల రద్దీపై చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య స్పందించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల రద్దీని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి జ్యోతిరాదిత్య విమానాశ్రయ అధికారులను ఆదేశించారు.కొవిడ్ టెస్టింగ్ కోసం టైమ్ స్లాట్ లను సూచించేలా టోకెన్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలని సూచించారు. ప్రయాణికులు సామాజిక దూరాన్ని పాటించడంతోపాటు మాస్కులు ధరించాలని కోరారు. ప్రయాణికులు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి అదనంగా ఆర్టీపీసీఆర్ పరీక్షల కౌంటర్ల సంఖ్యను పెంచామని విమానాశ్రయం సీఈఓ తెలిపారు. తాము ప్రయాణీకులకు మరింత సౌకర్యం కల్పించడానికి ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి పని చేస్తున్నామని, విమానాశ్రయంలోని వెయిటింగ్ ఏరియాలో ఫుడ్ కౌంటర్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు జరిపేందుకు వీలుగా 120 రాపిడ్ పీసీఆర్ పరీక్షా యంత్రాలను ఏర్పాటు చేయించారు.