Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశవ్యాప్తంగా బీజేపీ ఓటమే లక్ష్యం

మోదీ వినాశకర విధానాలతో ప్రజలు విసిగిపోయారు
సీపీిఐ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్ర`హైదరాబాద్‌: విధ్వంసకర రాజకీయాలు చేస్తున్న బీజేపీని దేశవ్యాప్తంగా ఓడిరచడమే తమ పార్టీ లక్ష్యం అని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి డాక్టరు కె. నారాయణ తెలిపారు. ఈ లక్ష్యంలో భాగంగా ఏప్రిల్‌ 14 నుంచి మే 15 వరకు నెల రోజులు దేశంలోని అన్ని రాష్ట్రాలలోని మహానగరాలు, పట్టణాలు, గ్రామాలలో ‘‘బీజేపీ హఠావో – దేశ్‌ బచావో’’ నినాదంతో పాదయాత్రలు నిర్వహించి బీజేపీ ప్రజా వ్యతరేక, వినాశకర విధానాలను ప్రజలకు వివరించి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి దించాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ మూసారాం బాగ్‌, ఆస్మాన్‌ గఢ్‌, టీవీ టవర్‌, బి బ్లాక్స్‌, తిరుమల హిల్స్‌, వీకే దాగే నగర్‌, బ్యాంకు కాలనీ తదితర బస్తీలు, కాలనీలలో ఆదివారం సీపీిఐ హైదరాబాద్‌ జిల్లా సమితి పాదయాత్ర నిర్వహించింది. డా. కె. నారాయణ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నరసింహ, కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌. ఛాయాదేవి, రాష్ట్ర సమితి సభ్యులు బి. వెంకటేశం తోపాటు వందలాదిమంది సీపీిఐ శ్రేణులు దుకాణాలు, ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ బీజేపీ ప్రజా వ్యతరేక, వినాశకర విధానాలను వివరించారు. ఈ సందర్బంగా డా. కె. నారాయణ మాట్లాడుతూ దేశమంతటా మత విషాన్ని వ్యాపింపజేస్తూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి అని బీజేపీ హుకుం జారీచేస్తే ప్రజలు ఊరుకోరనీ, కర్నాటకలో మాదిరిగానే దేశమంతటా తరమికొడుతారని హెచ్చరించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రచారానికి మోదీ, అమిత్‌ షా నాయకత్వం వహించినా ఆ పార్టీ అవమానకరమైన ఓటమి చెందడం ఆ పార్టీ వినాశకర విధానాలపై ప్రజలు విసిగిపోవడం వల్లనేనన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ఈడీ, సీబీఐ, ఐటి విభాగాలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.
ప్రధాని మోదీ తాను చేసిన హామీలన్నీ విస్మరించాడన్నారు. ప్రజలను పేదరికం, వెనుకబాటు నుంచి బయటపడవేయడంలో మోదీ ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందన్నారు. రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ దేశ సంస్కృతి, నైతికత, ప్రజా సంస్థలు, ప్రజాస్వామ్య నిర్మాణం, రాజ్యాంగ విలువలకు అపారమైన నష్టం కలిగించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, రాజ్యాంగ ఆదేశాన్ని పరిరక్షించడం కోసం ప్రగతిశీల, ప్రజాసామ్యవాదులందరూ ఏకమై బీజేపీ వినాశకర విధానాలు ప్రజలకు తెలిపి, చైతన్య పరిచి వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడిరచడానికి కృషి చేయాలనీ నారాయణ పిలుపునిచ్చారు. ఈటీ నరసింహ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తూ బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో సీపీఐ హైదరాబాద్‌ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, స్టాలిన్‌, కార్యవర్గ సభ్యులు జి. చంద్రమోహన్‌, నిర్లేకంటి శ్రీకాంత్‌, కంపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img