న్యూదిల్లీ: ధరల పెరుగుదల, కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ పై పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. దీంతో ఉభయ సభలో అనేకసార్లు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభమైన తర్వాత విపక్ష పార్టీల ఎంపీల ఆందోళనలతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడిరది. నలుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేయడంతో సభాపతి సభను వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు తమ నినాదాలను కొనసాగించారు. దీంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న బీజేపీ సభ్యుడు రాజేంద్ర అగర్వాల్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విపక్ష పార్టీల సభ్యులను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని నినాదాలు చేస్తూ కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకు వెళ్లారు. ధరల పెరుగుదల, జీఎస్టీ, ఇతర సమస్యల పై చర్చ చేపట్టాలని పట్టుబట్టిన ప్రతిపక్షాల నిరసనలతో సభ ప్రతిష్ఠభనకు గురి కావడంతో జులై 18న ప్రారంభమైనప్పటి నుంచి లోక్సభ సమావేశాలు అంతంత మాత్రంగానే సాగాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి పతకాలు సాధించిన భారత క్రీడాకారులను అభినందించారు. అటు తర్వాత వేర్వేరు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ప్రశ్నలను స్పీకర్ చేపట్టినపుడు, కాంగ్రెస్ సభ్యులు తమ నలుగురు ఎంపీల పై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. తొలుత తమతమ స్థానాల్లోనే నిరసన తెలిపిన వారు తర్వాత వెల్లోకి దూసుకు వెళ్లారు. దీంతో స్పీకర్ వారిని తమ స్థానాల్లోకి వెళ్లాలని, సభను సజావుగా నడవనివ్వాలని అభ్యర్థించారు. అయితే విపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించడంతో సభను 2 గంటల వరకు వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ నిరసనలు
రాజ్యసభలోనూ ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్ట్, ఇతర అంశాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీలు సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో ఆగస్టు 2న పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలపై రాజ్యసభలో చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. సభ్యుల నిరసనలతో వాయిదా పడిన సభ ప్రశ్నోత్తరాల సమయం కోసం మధ్యాహ్నం తిరిగి సమావేశమైనప్పుడు అనేక మంది ఎంపీలు సభా వెల్లోకి వెళ్లి కేంద్ర విధానానికి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించారు. అయితే అధ్యక్ష స్థానంలోఉన్న భువనేశ్వర్ కలిత ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శివసేన ఎంపీలు ఆందోళన చేయడంతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిరది. రాజకీయ అజెండాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగుతుండగా, లోక్సభ, రాజ్యసభ రెండిరటిలోనూ ధరల పెరుగుదలపై చర్చ జాబితా చేసినందున సభా కార్యకలాపాలు, ప్రశ్నోత్తరాల సమయం సజావుగా జరిగేలా అనుమతించాలని సభా నాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లేచి, గుజరాత్, మహారాష్ట్ర, అసోం వంటి రాష్ట్రాల్లో వివిధ పరిణామాలపై చర్చకు నోటీసులు పంపినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇదిలాఉండగా, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నిర్లక్ష్యం చేయడంపై వామపక్ష పార్టీల సభ్యులు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు వేతాలను పెంచాలని ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.