. ప్రతి కాలేజీ, వర్సిటీలో భారీ హోర్డింగులు పెట్టాలి
. పోలీస్, ఎక్సైజ్, ఎస్ఈబీ సమన్వయంతో పని చేయాలి
. సమీక్షలో సీఎం జగన్ ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. దీంతో పాటు అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడం, మరింత సమన్వయంతో సచివాలయాల్లోని మహిళా పోలీస్ల పనితీరును మెరుగుపర్చడం, దిశ చట్టం, యాప్లను మరింత పక్కాగా అమలు చేసేలా చూడడంపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖపై సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు ఏపీని నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అక్రమ మద్యం నియంత్రణ, గంజాయిసాగు అరికట్టడంపై వంటి వాటిని ప్రతి గురువారం పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమై సమీక్షించారు. జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. నార్కొటిక్స్, అక్రమ మద్యాన్ని అరి కట్టడం, సచివాలయాల మహిళా పోలీసులతో సమన్వయం, దిశ చట్టం, యాప్ ఇంకా సమర్థ వినియోగంపై సమీక్షించాలి. ఇక నుంచి ఇవన్నీ రెగ్యులర్గా జరగాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ఎస్ఈబీ టోల్ఫ్రీ నెంబర్ 14500తో పాటు, నార్కొటిక్స్ నియంత్రణపై అన్ని కాలేజీలు, యూనివర్సిటీల వద్ద నెల రోజుల్లో పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలనీ, ఎక్కడా, ఏ ఒక్క విద్యార్థి నార్కొటిక్స్ వినియోగించకుండా చూడాలన్నారు. రాష్ట్రాన్ని వచ్చే మూడు, నాలుగు నెలల్లో నార్కొటిక్స్ రహిత ప్రాంతంగా తీర్చి దిద్దాలనీ, అదే లక్ష్యంతో పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు పని చేయాలని సూచించారు. మహిళా పోలీసులు, దిశ చట్టం, యాప్ను ఇంకా పటిష్టం చేయాలని సూచించారు. మహిళా పోలీసుల పనితీరు ఇంకా మెరుగుపర్చడంపై దృష్టి పెటాలన్నారు. రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది మహిళా పోలీస్లు ఉన్నారు. దిశ చట్టాన్ని ఇంకా బాగా అమలు చేయాలి. యాప్ డౌన్లోడ్స్ పెరగాలి. గంజాయిసాగుదార్లకు వ్యవసాయం, పాడి వంటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలి. అప్పుడు వారికి శాశ్వత ఉపాధి కల్పించినట్లు కూడా అవుతుంది. గంజాయి సాగుదార్లను మార్చే విధంగా, ‘ఆపరేషన్ పరివర్తన్’ నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. అక్రమ వ్యాపారాలు దేనిపై ఫిర్యాదు వచ్చినా ఎస్ఈబీ అధికారులు వెంటనే స్పందించాలనీ, ఎస్ఈబీ పరిధి కేవలం మద్యం వరకే కాకుండా నార్కొటిక్స్, గంజాయి, గుట్కాలు.. వంటి వాటి విషయాల్లో కూడా కఠినంగా వ్యవహరించాలన్నారు. లోకల్ ఇంటెలిజెన్స్ను (నిఘా)ను బాగా వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలకు 2.82 లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చామని, ఆ భూముల అభివృద్ధికి సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం (ఎక్సైజ్ శాఖ మంత్రి) కె.నారాయణస్వామి, హోం మంత్రి తానేటి వనిత, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ, ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ వివేక్యాదవ్, అడిషనల్ డీజీపీ రవిశంకర్, ఎస్ఈబీ డైరెక్టర్ రమేశ్రెడ్డితో పాటు, అనేకమంది అధికారులు పాల్గొన్నారు.