నేషనల్ హెరాల్డ్ కేసులో నాలుగో రోజు విచారణ కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. గత వారంలో వరసగా మూడు రోజుల పాటు రాహుల్ను ఈడీ అధికారులు విచారించారు. గత శుక్రవారం కూడా విచారణకు హాజరుకావాలని రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు పంపింది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి వద్దకు వెళ్లాలని… అందువల్ల విచారణకు హాజరుకాలేనని ఈడీని రాహుల్ కోరారు. సోమవారం విచారణకు హాజరవుతానని చెప్పారు. రాహుల్ విన్నపానికి ఈడీ అధికారులు ఓకే చెప్పారు. ఈ క్రమంలో ఆయన చెప్పినట్టుగానే ఈడీ విచారణకు ఈరోజు హాజరయ్యారు. మరోవైపు రాహుల్ ఈడీ విచారణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తన శక్తిని నిరూపించుకునే కార్యక్రమంగా మలుచుకుంది. రాహుల్ ఈడీ కార్యాలయానికి వెళ్లిన మూడు రోజులూ దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టింది.