న్యూదిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ట్విటర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోందని, మోదీ అత్యంత నైపుణ్యంతో అమలు చేస్తున్న చర్యల వల్ల 45 కోట్ల మందికిపైగా తమకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశలను వదులుకున్నారని ఆరోపించారు. 75 ఏళ్లలో ఈ విధంగా చేసిన మొదటి ప్రధాన మంత్రి మోదీయేనని మండిపడ్డారు. నవ భారతంలో నూతన నినాదం ‘‘ఇంటింటా నిరుద్యోగం’’ అని పేర్కొన్నారు. గడచిన ఐదేళ్లలో 2.1 కోట్ల మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కోల్పోయారని, 45 కోట్ల మంది ఉద్యోగాల కోసం అన్వేషించడం మానేశారని చెప్తున్న ఓ నివేదికను రాహుల్ ప్రస్తావించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఇటీవల సిలబస్ను సవరించింది. 11, 12 తరగతుల సిలబస్ నుంచి ఆఫ్రో-ఆసియన్ టెరిటరీస్లోని ఇస్లామిక్ రాజ్యాల ఎదుగుదల, క్రానికల్స్ ఆఫ్ మొఘల్ కోర్ట్స్, ది కోల్డ్ వార్, ఇండస్ట్రియల్ రివల్యూషన్ అధ్యాయాలను చరిత్ర, రాజనీతి శాస్త్రం నుంచి తొలగించింది. దీనిపై రాహుల్ గాంధీ ఏప్రిల్ 9న ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని రక్షించాలంటే, ఆరెస్సెస్ చేతుల్లో ఉన్న సంస్థలను పరిరక్షించాలని చెప్పారు. సీబీఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సప్రెసింగ్ ఎడ్యుకేషన్ అని అభివర్ణించారు.