భారీ ర్యాలీతో ప్రారంభం… 29న ముగింపు
హాజరుకానున్న వివిధ జిల్లాల కళాకారులు, సినీ దర్శకులు
విశాలాంధ్ర బ్యూరో ` కడప: తెలుగునాట సాహితీ, కళా సంస్కృతుల పరిమళాలు వెదజల్లిన కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర 10వ మహాసభలు, కళా ఉత్సవాల నిర్వహణకు కడప నగరం ముస్తాబైంది. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. నగరాన్ని స్వాగత ద్వారాలు, తోరణాలు, ప్లెక్సీలతో అలంకరించారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరం (కమ్ముసాహెబ్ శ్యామలాదేవి ప్రాంగణం), నేక్నామ్ఖాన్ కళాక్షేత్రం (మాదాల రంగారావు కళా ప్రాంగణం)లో కార్యక్రమాలు అలరించనున్నాయి. కార్యక్రమాలు జరిగే ప్రాంతంలోనూ, నగరంలోని అనేక కూడళ్లలో కళారూపాలను ఆవిష్కరించే విధంగా జండాలతో అలంకరించారు. కళాఉత్సవాల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పదకవితా పితామహుడు అన్నమయ్య, అల్లసాని పెద్దన, ధూర్జటి, నంది తిమ్మన ఇలా చెప్పుకుంటూ పోతే కళాకారులకు ఎంతో పేరుగాంచిన కడప జిల్లాలో మహాసభలు జరగడం జిల్లాకే గర్వించదగ్గ విషయం. గురువారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రానాయక్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు, ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిలతో పాటు సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు పాల్గొననున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి కళాకారులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ప్రతి రోజు ప్రతి జిల్లా నుంచి వచ్చే కళాకారులు గేయనృత్యరూపకం, వీధి నాటకాలు, తప్పెట గుళ్లు, కోలాటం, డప్పుల నృత్యంతో పాటు అనేక నాటికలను ప్రదర్శిస్తారు. ప్రతి రోజు కార్యక్రమాలలో ప్రముఖులు పాల్గొననున్నారు. 27న జరిగే కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న), ఇప్టా ఉపాధ్యక్షులు కందిమళ్ల్ల ప్రతాపరెడ్డి, అరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు సంజీవమ్మ వంటి ఉద్దండులు పాల్గొననున్నారు. మొదటి రోజు జిల్లా పరిషత్ ఆడిటోరియం నుంచి నేక్నామ్ ఖాన్ కళాక్షేత్రం వరకు కళాకారులతో అంగరంగ వైభవంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. 28వ తేదీ శనివారం జరిగే కార్యక్రమాలలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు విమలక్క పాల్గొననున్నారు. 29న ఆదివారం జరిగే కార్యక్రమాలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరవుతారు. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావడానికి ఆహ్వానసంఘం విశేషంగా కృషి చేస్తోంది. కవులకు పుట్టినిల్లు అయిన కడప జిల్లాలో ఇలాంటి మహాసభలు జరగడం జిల్లా ప్రతిష్ఠకు గొప్ప విషయమనీ, కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు జిల్లా నలుమూలల ఉన్న కళాకారులు పాల్గొని కడప ఫ్యాక్షన్ గడ్డే కాదు కవులకు, కళాకారులకు ఆదర్శనీయమైన జిల్లా అని చాటిచెప్పాలని మహాసభల ఆహ్వానసంఘం ప్రధాన కార్యదర్శి, సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.