భారత్లో చాపకింద నీరులా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. ఇప్పటికే 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇటీవలే ఐఐటీ కాన్పూర్ సైతం ఫిబ్రవరిలో మూడో వేవ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నివేదికలో వెల్లడిరచింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒమిక్రాన్ నేపథ్యంలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో మన దేశంలో పలు రాష్ట్రాలు రాత్రి పూట కర్ఫ్యూ విధించాయి. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘానికి పెద్ద సవాలుగా మారింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించబోతుంది. ఎన్నికల నిర్వహణ, కరోనా తీవ్రతపై చర్చించనుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులతో ఎలక్షన్ కమిషన్ అధికారులు కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి యూనియన్ హెల్త్ సెక్రటరీ రాకేష్ భూషణ హాజరవనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. అయితే దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా, ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా ఉత్తరప్రదేశ్లో ఎన్నికల వాయిదాను పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టు కేంద్రానికి ఇప్పటికే సూచనలు జారీచేసింది.వాస్తవానికి ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రచారం ఊపందుకుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓ వైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో నోటిఫికేషన్ ఇవ్వొచ్చా? ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? సాధ్యసాధ్యాలేంటి? ఇందుకు ఆరోగ్య శాఖ సన్నద్ధత ఎలా ఉంది ఉని తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం సమావేశం అవుతుంది. ఒమిక్రాన్ తీవ్ర రూపం దాలుస్తున్న క్రమంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచన చేస్తోంది.