న్యూదిల్లీ: దిల్లీ ఉపమఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మళ్లీ సమన్లు పంపింది. సోమవారం ఉదయంం 11 గంటలకు ఆయన సీబీఐ ఎదుట హాజరు కావలసి ఉంటుంది. తాను హాజరవుతాననీ, దర్యాప్తునకు సంపూర్ణంగా సహకరిస్తానని సిసోడియా అంటున్నారు. కానీ సోమవారం సిసోడియా సీబీఐ ఎదుట హాజరైనప్పుడే ఆయనను అరెస్టు చేసే అవకాశం మెండుగా కనిపిస్తోంది. సీబీఐ సమన్లు అందిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సిసోడియాను అరెస్టు చేయవచ్చునని బలమైన అనుమానం వ్యక్తం చేశారు. దిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఆబ్కారీ విధానంలో ఏదో కుంభకోణం జరిగిందన్న కారణంగా సీబీఐ దాడులు చేసింది.
ఇదివరకే సిసోడియా ఇంటి మీద దాడి చేసి సీబీఐ 11 గంటలపాటు ప్రశ్నించింది. ఈ దాడుల్లో తనకు వ్యతిరేకంగా ఏ ఆధారమూ లభించలేదని సిసోడియా అంటున్నారు. గుజరాత్ శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయాలని తలపెట్టింది. కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ గుజరాత్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీయేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది.