Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నేను కోర్టుకొస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు!

. పాలన, సంక్షేమ పథకాల అమల్లో బిజీగా ఉన్నా
. అడ్వకేట్‌ కమిషనర్‌ సమక్షంలో సాక్ష్యం తీసుకోండి
. కోడికత్తి కేసులో హాజరుమినహాయింపు కోసం సీఎం జగన్‌ పిటిషన్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: కోడికత్తి కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఈసారి కూడా ఎన్‌ఐఏ కోర్టులో విచారణకు హాజరు కాలేదు. తన వ్యక్తిగత హాజరు మినహాయించాలని, అడ్వకేట్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో సాక్ష్యం తీసుకునేలా ఆదేశించాలని, ఘటనపై తదుపరి దర్యాప్తును చేయాలని ఎన్‌ఐఏ కోర్టును జగన్‌ కోరారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన కేసులో సీఎంతో పాటు, ఆయన పీఏ నాగేశ్వరరెడ్డి సాక్షులుగా విచారణకు హాజరుకావాలని ఎన్‌ఐఏ కోర్టు గత విచారణలో ఆదేశాలు జారీ చేసింది. విచారణ షెడ్యూల్‌ను సైతం ఖరారు చేసింది. సోమవారం సీఎం కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు అయ్యేందుకు మినహాయింపు కావాలని సీఎం తరపు న్యాయవాది కోర్టును కోరారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించటంతో పాటు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాల సమీక్షలు ఉంటున్నాయని కోర్టుకు తెలిపారు. సీఎం కోర్టుకు హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్‌కు ఇబ్బందులొస్తాయన్నారు. అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించి అతని సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కానీ ఇతర ఎలక్ట్రానిక్‌ మార్గాల ద్వారా సాక్ష్యం నమోదు చేయాలని న్యాయమూర్తిని కోరారు. పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి… షెడ్యూల్‌ను రద్దు చేశారు. నిందితుడ్ని, ఎన్‌ఐఏ అధికారులను కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేశారు. 13న పిటిషన్లపై విచారణ జరిపి వ్యక్తిగత హాజరు మినహాయింపుపై నిర్ణయం తెలుపుతామన్నారు. కేసు విచారణను పొడిగించేందుకే రెండు పిటిషన్లను దాఖలు చేశారని నిందితుడి తరపు న్యాయవాది సలీం తెలిపారు. బాధితునిగా ఉన్న సీఎం కచ్చితంగా కోర్టుకు హాజరవ్వాలని ఆయన అన్నారు. 2019 లోనే ఎన్‌ఐఏ విచారణ జరిపి చార్జ్‌షీట్‌ దాఖలు చేసిందన్నారు. నాలుగేళ్ల తర్వాత కేసులో తదుపరి దర్యాప్తు కోరటం సమంజసం కాదన్నారు. నిందితుడు శ్రీనివాసరావుపై స్వగ్రామంలో కేసు నమోదైనట్లు అతనికే తెలీదన్నారు. తోపులాట జరిగినట్లు నమోదైన కేసులో ఇన్నేళ్లయినా అభియోగపత్రం కూడా ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఘటన వెనుక కుట్రకోణం ఉందని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. నిందితుడు శ్రీనివాసరావుపై అతని స్వగ్రామంలో 2017 లో కేసు నమోదైందని, ఆ విషయాన్ని దాచిపెట్టి ఎయిర్‌పోర్ట్‌ పీఎస్‌లో ఎన్‌వోసి తీసుకున్నారని సీఎం తరపు న్యాయవాది వెంకటేశ్వరరావు తెలిపారు. శ్రీనివాసరావు పనిచేస్తున్న రెస్టారెంట్‌ యజమాని ఈ విషయాన్ని దాచిపెట్టారన్నారు. పోలీసులు సైతం సరైన విచారణ చేయకుండానే ఎన్‌వోసి ఇచ్చారని, దీని ద్వారా నిందితుడు విమానాశ్రయం లోకి ప్రవేశించేందుకు పాస్‌లు పొందారన్నారు. రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ టీడీపీ సానుభూతిపరుడని తెలిపారు. ఇదంతా ఓ పథకం ప్రకారం జరిగిందన్నారు. ఆపరేషన్‌ గరుడ పేరుతో ఓ సెలబ్రిటీ పై దాడి జరగబోతోందనే విషయాన్ని ఓ ప్రముఖ వ్యక్తి చెప్పారని, ఆతర్వాతే ఈ ఘటన జరిగిందన్నారు. ఘటన జరిగిన ముందు రోజే నిందితుడు శ్రీనివాసరావు సీఎం జగన్‌ ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని న్యాయవాది వెంకటేశ్వర్లు అన్నారు. ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని, ఎన్‌ఐఏ సైతం ఘటన వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నామని తెలిపిందన్నారు. ఈ క్రమంలో ఘటనపై దర్యాప్తు కొనసాగాలని కోరినట్లు సీఎం తరపు న్యాయవాది తెలిపారు. మరో వైపు సీఎంకు ప్రజాపాలనా, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షలు ఉంటాయని, అందుకే కోర్టు హాజరుకు మినహాయింపు కోరినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img