Friday, April 19, 2024
Friday, April 19, 2024

నొప్పి లేకుండా మరణశిక్ష

. ఉరి శిక్షకు ప్రత్యామ్నాయాలు చూడాలి
. కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు

న్యూదిల్లీ : ఉరిశిక్ష అమలుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నొప్పి కలగకుండా మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది. గౌరవకర మరణం చాలా ముఖ్యమైన అంశమని సుప్రీం కోర్టు అభిప్రాయపడిరది. ఉరి శిక్షకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలపై కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కొన్ని కేసుల్లో కోర్టులు మరణశిక్ష విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. మెడకు ఉరి వేసి చంపడం కన్నా.. నొప్పి లేనటువంటి ఇతర పద్ధతుల్లో ప్రాణాలు తీసే వీలు ఉందా అని ఇవాళ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మెడకు ఉరి వేసి శిక్షించడం కన్నా.. తక్కువ స్థాయిలో నొప్పితో చనిపోయే పద్ధతులగురించి సమాచారాన్ని సేకరించి, ఆ అంశాన్ని చర్చించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఉరిశిక్ష ప్రభావం గురించి స్టడీ చేసి రిపోర్టు ఇవ్వాలని అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణిని సుప్రీం కోర్టు కోరింది. ఈ అంశంపై నిపుణుల కమిటీ వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీం కోర్టు చెప్పింది. మరణశిక్ష పడ్డవాళ్లకు నొప్పి లేకుండా చావును ఇవ్వాలన్న అంశంపై దాఖలైన పిటిషన్‌ విచారణ నేపథ్యంలో కోర్టు ఈ అంశాన్ని పేర్కొన్నది. ఉరికి బదులుగా తుపాకీతో కాల్చడం, ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇవ్వడం, ఎలక్ట్రిక్‌ షాక్‌ లాంటి పద్ధతులను అమలు చేయాలంటూ పిటీషన్‌లో సూచించారు. మెడకు ఉరి వేసి చంపడం అనే చాలా క్రూరమైన పద్ధతి అని న్యాయ కమిషన్‌ న్యాయవాది రిషి మల్హోత్రా తెలిపారు. ఇది చాలా ఆలోచించాల్సిన అంశమే అని, కానీ దీనిపై శాస్త్రీయ సమాచారం అవసరమని, నొప్పుల గురించి అధ్యయనం చేసిన సమాచారం ఇవ్వాలని, త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. ఈ కేసు విచారణను మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. కేసు విచారణ సమయంలో వివిధ రకాల మరణాల గురించి న్యాయమూర్తులు చర్చించారు. అమెరికాలో లీథల్‌ ఇంజెక్షన్‌ ఇచ్చి శిక్ష విధించే పద్ధతి అమలులో ఉన్నా… ఆ పద్ధతిలో కూడా నొప్పి ఉన్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ అభిప్రాయపడ్డారు. ఇంజెక్షన్‌ ద్వారా చంపడమూ నొప్పే అని, ఇక షూటింగ్‌ అంటే అదో మిలిటరీ గేమ్‌ అవుతుందని, ఇది మానవ హక్కులను ఉల్లంఘించినట్లే అని సీజేఐ చంద్రచూడ్‌ అన్నారు. ఒకవేళ ప్రాణాంతక ఇంజెక్షన్‌ విధానాన్ని ఆశ్రయిస్తే, అప్పుడు ఎటువంటి రసాయనం వాడాలన్న దానిపై పరిశోధన చేయాలని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అయితే ఉరి తీయడాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటిస్తే, అప్పుడు ఇతర పద్ధతుల గురించి తెలుసుకోవలసి ఉంటుందని సీజేఐ చంద్రచూడ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img