సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఉత్తర ప్రదేశ్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తుండటంపై మండిపడ్డారు. రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించడం, పగటి సమయంలో లక్షలాది మందిని బహిరంగ సభలకు పిలవడం, ర్యాలీలు ఏమిటని సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించడం, పగటి సమయంలో లక్షలాది మందిని బహిరంగ సభలకు పిలుస్తుండటం.. ఇది సామాన్యుడి అవగాహనా సామర్థ్యానికి అతీతమైనదని పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వం డిసెంబరు 25 నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తోంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. ఓ వైపు కేసులు పెరుగుతున్న వేళ దీనివల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. ఒమైక్రాన్ వ్యాప్తిని ఆపడానికి ప్రాధాన్యమివ్వాలో, ఎన్నికల్లో బలాన్ని ప్రదర్శించడానికి ప్రాధాన్యం ఇవ్వాలో మనం నిజాయితీగా నిర్ణయించుకోవాలన్నారు. ఘజియాబాద్లో డిసెంబరు 25న జన విశ్వాస్ యాత్రలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్న సంగతి తెలిసిందే.ప్రధాని మోదీ డిసెంబరు 23న నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ పరిస్థితి, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధతల గురించి సమీక్షించారు.అయితే శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు ప్రచార సభలను నిర్వహిస్తున్నాయి. ప్రజలను పెద్ద ఎత్తున సమీకరిస్తున్నాయి.