దిగొచ్చిన హరియాణా ప్రభుత్వం
‘కర్నాల్’పై నిష్పాక్షిక దర్యాప్తునకు అంగీకారం
దోషులని తేలితే రైతులపైనా చర్యలని మంత్రి బెదిరింపు
చండీగఢ్ :
తమ సమస్యల పరిష్కారానికి గొంతెత్తితే లాఠీలతో దాడి చేయడమే కాకుండా అదుపు తప్పితే తలలు పగలగొట్టండి అంటూ పోలీసులకు స్వయాన ఐఏఎస్ అధికారి ఆదేశాలివ్వడంతో కర్నాల్ రైతులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మంగళవారం కిసాన్ మహాపంచాయత్ నిర్వహించిన తర్వాత మినీ సెక్రటేరియట్ను ముట్టడిరచి.. వరుసగా మూడవ రోజు ధర్నా కొనసాగించారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే తప్ప ఆందోళనను విరమించబోమని అధికారులకు తేల్చిచెప్పారు. అదీగాక రైతు నేతలకు కర్నాల్ జిల్లా అధికారులకు ఇప్పటికే అనేక దఫాలు జరిగిన చర్చలన్నీ విఫలం కావడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. రైతుల ఉక్కుసంకల్పానికి హరియాణా ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. కర్నాల్లో చోటుచేసుకున్న అన్ని పరిణామాలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపిస్తామని హరియాణా ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అయితే రైతుల తప్పు ఉందని తెలిస్తే వారినీ ఉపేక్షించ బోమని బెదిరించింది. అంబాలాలో విలేకరులతో మాట్లాడిన ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్ తమ ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని వెల్లడిరచారు. తాజా పరిణామాల దృష్ట్యా కర్నాల్ ఉదంతంపై నిష్పాక్షిక దర్యాప్తునకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఐఏఎస్ అధికారి ఆయుష్ సిన్హాపై దర్యాప్తు జరిపిస్తాం. రైతులుగానీ,
వారి నేతలుగానీ దోషులని తేలితే తప్పక చర్యలు తీసుకుంటాం. కర్నాల్లో నిరసన తెలుపుతున్న రైతుల న్యాయబద్ధ డిమాండ్లను మాత్రమే పరిష్కరిస్తాం. ఎవరో చెప్పారని మరెవ్వరినో ఉరికంభం ఎక్కించలేం. దేశ ఐపీసీ.. రైతుల ఐసీపీ వేర్వేరా ? చేసిన తప్పును బట్టి శిక్ష ఉంటుందేగానీ ఎవరు ఏది చెబితే అది అమలు చేయడం కుదరదు. జరిగిన నేరం ఎలాంటిదో తెలియాలంటే దర్యాప్తు జరపాల్సిందేనని ఐఏఎస్ సస్పెన్షన్ డిమాండునుద్దేశించి విజ్ అన్నారు. పోలీసులకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఐఏఎస్ సిన్హాపై హత్య కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండు చేసింది. శాంతియతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని మంత్రి విజ్ అన్నారు. ‘రైతులు కర్నాల్లో ఆందోళన చేస్తున్నారు. అది వారి ప్రజాస్వామిక హక్కు. మా అధికారులు వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. చర్చలన్నవి ప్రజాస్వామ్యంలో కీలకం’ అని తెలిపారు.
అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ బంద్
గురువారం అర్ధరాత్రి వరకు కర్నాల్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తూ హరియాణా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు రాష్ట్ర హోంశాఖ వెల్లడిరచింది. సెప్టెంబరు 9వ తేదీ ఉదయం 7గంటల నుంచి రాత్రి 11.59 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలు కర్నాల్ జిల్లాలో నిలిపివేశామంటూ ప్రకటన వెలువరించింది. ఇదిలావుంటే, బుధవారం రైతు నేతలకు, ప్రభుత్వ అధికారులకు మధ్య జరిగిన చర్చలు విఫలం కాగా అన్నదాతల నిరవధిక ధర్నా కొనసాగింది. గురువారానికి ఆందోళన మూడవ రోజుకు చేరుకుంది. కర్నాల్ మినీ సెక్రటేరియట్ గేటు బయట ఉద్యమకారులు బైఠాయించారు. మహా పంచాయత్ నిర్వహించడం, ఆపై చర్చలు విఫలం కావడంతో రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేసిన విషయం విదితమే.