న్యూదిల్లీ : పత్రికా స్వేచ్ఛను అణచివేయడం లేదా నిర్మూలించడం తమకు ఇష్టం లేదని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. అయితే తమపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేసేందుకు నేరుగా కోర్టును ఆశ్రయించేందుకు ప్రత్యే క మార్గాన్ని సృష్టించలేమని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్లో తమపై పెట్టిన మూడు ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరుతూ డిజిటల్ న్యూస్ పోర్టల్ ‘ది వైర్’ ను ప్రచురించే ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం, దీనికి చెందిన ముగ్గురు జర్నలిస్టులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఈమేరకు వ్యాఖ్యానించింది. ఈ విషయమై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచిస్తూ వారికి రెండు నెలల పాటు రక్షణ కల్పించింది. ‘‘మీరు హైకోర్టుకు వెళ్లి.. కేసుల రద్దుపై వాదించండి.. మేము మిమ్మల్ని తాత్కాలికంగా రక్షిస్తాము’’ అని న్యాయమూర్తులు బి.ఆర్.గవాయ్, బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎప్ఐఆర్లను కొట్టివేసేందుకు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ఆర్టికల్ 32 కింద వేరే మార్గాన్ని సృష్టించలేమని ధర్మాసనం అభిప్రాయపడిరది. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటామని, పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవాలనుకోవడం లేదని పేర్కొంది. పిటిషనర్ల తరఫు న్యాయవాదికి సుప్రీం కోర్టు రక్షణ కల్పిస్తుందని వారు ఈ సమస్యపై హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం, ముగ్గురు జర్నలిస్టులు – సెరాజ్ అలీ, ముకుల్ సింగ్ చౌహాన్, ఇస్మత్ అరా – ఉత్తరప్రదేశ్లోని రాంపూర్, ఘజియాబాద్, బారాబంకీలో తమపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది షాదన్ ఫరాసత్ వీరి తరఫున వాదనలు వినిపించారు.