విద్యుత్ కోతలు ఎత్తివేస్తూ నిరంతర సరఫరాకు ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:
పరిశ్రమలకు పవర్ హాలిడేను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. విద్యుత్ కోతలు సైతం ఎత్తివేస్తూ నిరంతర సరఫరాకు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో బొగ్గు కొరత సమస్య తీరడంతో విద్యుత్ సరఫరాలో కొన్ని రోజులుగా నెలకొన్న ఇబ్బందులు తొలగనున్నాయి. ముఖ్యంగా పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పవర్ హాలిడే ప్రకటించింది. ఈనెల 9వ తేదీ నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరణ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపినప్పటికీ…అది పూర్తిస్థాయిలో అమలు కాలేదు. అలాగే గ్రామాలలోనూ అనధికార విద్యుత్ కోతలు విధించారు. ఒకపక్క వేసవి ఎండల తీవ్రత, మరోపక్క కరెంట్ వినియోగం గణనీయంగా పెరిగడంతో పల్లెలకు కోతలు మరింత ఎక్కువయ్యాయి. కరెంట్ ఎప్పుడు వస్తుందో, పోతుందో అర్థంగాని పరిస్థితి నెలకొంది. బొగ్గు కొరత కారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది. విద్యుత్ కొనుగోలుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడిరది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కొంత తగ్గడం, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు నిల్వలు చేరుకోవడంతో అన్ని యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. విద్యుత్ సరఫరా మెరుగునకు అవకాశం ఏర్పడిరది. దీంతో పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కొరత వలన కొద్దిరోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ పంపిణీలో సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడటంతో అన్ని రంగాల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పరిశ్రమలకు పూర్తిస్థాయిలో నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతోపాటు మిగిలిన ప్రాంతాలకు కోతల వేళలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.