ప్రస్తుతం జరుగుతున్న పది, పన్నెండో తరగతి పరీక్షల్లో ఏఐ ఆధారిత చాట్జీపీటీని వాడితే కఠిన చర్యలు చేపడతామని విద్యార్ధులను సీబీఎస్ఈ హెచ్చరించింది. ఈ వైరల్ చాట్బాట్ సంక్లిష్ట ప్రశ్నలకు సైతం క్షణాల్లో సమాధానాలు ఇస్తోంది. ఏఐ ఆధారిత చాట్జీపీటీ కూడా గణాంక సమస్యలను ఇట్టే పరిష్కరిస్తోంది. పది, పన్నెండో తరగతి విద్యార్ధులకు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని బోర్డు ఇప్పటికే నిషేధించింది. తాజాగా పరీక్షా కేంద్రాల్లో చాట్జీపీటీ వాడకాన్ని నిషేధించింది. సీబీఎస్ఈ నిర్వహించే పది, పన్నెండో తరగతి పరీక్షల్లో కృత్రిమ మేథ ఆధారంగా పనిచేసే చాట్జీపీటీని నిషేధించామని సీబీఎస్ఈ అధికారులు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్, చాట్జీపీటీ, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. పరీక్షల్లో పాస్ అయ్యేందుకు అక్రమ మార్గాలను అనుసరించడంపై విద్యార్థులను సీబీఎస్ఈ హెచ్చరించింది. ఎగ్జామ్స్ అడ్మిషన్ కార్డులో సైతం పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడితే బోర్డు నిబంధనలు అనుసరించి చర్యలు చేపడతామని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే సందేశాలు, నకిలీ వీడియోలను విశ్వసించరాదని, వదంతులను వ్యాప్తిచేయరాదని కోరింది.