Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పాదయాత్రలో షర్మిల అరెస్ట్‌

హైదరాబాద్‌కు తరలింపు

విశాలాంధ్ర-హైదరాబాద్‌: మహబూబాబాద్‌ సమీపంలోని బేతోలు వద్ద వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన కార్వాన్‌ లోకి వెళ్లి షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను పోలీస్‌ వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. షర్మిలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు షర్మిలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తొలుత పాదయాత్రను మహబూబాబాద్‌ బేతోలులో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైఎస్‌ఆర్‌టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బేతోలులోని షర్మిల బస శిబిరం దగ్గర బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇప్పటికే షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్‌ ఇచ్చారు. శంకర్‌ నాయక్‌ సైగ చెయ్యి… ఎవడోస్తాడో చూస్తా అంటూ సవాల్‌ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్సార్‌ బిడ్డ అని ధ్వజమెత్తారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో మాట్లాడిన షర్మిల… ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌పై మాటలతో ఎదురు దాడి చేశారు. ‘శంకర్‌ నాయక్‌ బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నాడు. పాదయాత్రను అడ్డుకునేలా కార్యకర్తలను ఉసి గొల్పుతున్నారు. ప్రజల పక్షాన నిలబడి, కొట్లాడుతున్నందుకు భయపడాలా? మీరు చేసిన మోసాలు ఎత్తి చూపిస్తున్నందుకు భయపడాలా? మీ నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలు ఆడుతున్నారు శంకర్‌ నాయక్‌ ఒక కబ్జా కోర్‌ … జనాల దగ్గర భూములు గుంజుకోడమే ఆయనకు తెలుసు’ అంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img