న్యూదిల్లీ : కోవిడ్19 కొత్త రూపం ఒమిక్రాన్ సోకిన రోగులకు మల్టీ విటమిన్లు, పారాసెట్మాల్ మాత్రలతో మాత్రమే చికిత్స అందిస్తున్నట్లు దిల్లీలోని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) ఆస్పత్రి వైద్యులు శుక్రవారం తెలిపారు. దిల్లీలో అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సదుపాయంఆ ఉన్న ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో ఇప్పటివరకు 40మంది వరకు ఒమిక్రాన్ బాధితులు చికిత్స పొందగా వారిలో 19మంది ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు. వీరిలో 90 శాతం మంది రోగులకు ఎటువంటి లక్షణాలు లేవని, మిగిలిన వారిలో గొంతు నొప్పి, కొద్దిగా జ్వరం, ఒంటి నొప్పులు వంటి తేలికపాటి లక్షణాలు కనిపించినట్లు ఆస్పత్రి సీనియర్ వైద్యుడు తెలిపారు. ‘చికిత్సలో మల్టీ విటమిన్లు, పారాసెట్మాల్ మాత్రలు వాడాం.. వారికి మరే ఇతర ఔషధం ఇవ్వాల్సిన అవసరం రాలేదు’ అని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది రోగులు విదేశాల నుండి వచ్చిన తర్వాత విమానాశ్రయంలో కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారించబడ్డ వారేనని పేర్కొన్నారు. వారిలో చాలా మంది ంండు డోసులు టీకాలు వేయించుకున్నవారేనని, ముగ్గురు నలుగురైతే బూస్టర్ షాట్లు కూడా తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఒమిక్రాన్ రోగులలో ఆఫ్రికాకు చెందిన ఎంపీ, ఉత్తర భారత రాష్ట్రానికి చెందిన రాజకుటుంబ సభ్యుడు, అధికారుల కుటుంబ సభ్యులు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం... దిల్లీలో ఇప్పటివరకు 67 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, వారిలో 23 మంది డిశ్చార్జ్ చేయబడ్డారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్ఎన్జేపీ ఆస్పత్రితోపాటు, సర్ గంగా రామ్ సిటీ ఆస్పత్రి, మాక్స్ హాస్పిటల్ సాకేత్, వసంత్ కుంజ్లోని ఫోర్టిస్ ఆస్పత్రి, తుగ్లకాబాద్లోని బాత్రా ఆస్పత్రిలో కూడా ఒమిక్రాన్ అనుమానిత కేసులకు చికిత్స చేయడానికి, క్వారంటైన్ చేయడానికి సౌకర్యాలను ఏర్పాటు చేశాయి. ఒమిక్రాన్ వ్యాపించిందో లేదో తెలుసుకోవడానికి డిసెంబరు 22 నుంచి దిల్లీలో కోవిడ్
19 సోకినవారి నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నారు.