నేడు భేటీలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం : ఎస్కేఎం
న్యూదిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలప్పుడు ట్రాక్టర్ మార్చ్కు ఇచ్చిన పిలుపును ఉపసంహరించుకోవడం లేదని రైతు నేతలు తెలిపారు. ఉద్యమం భవిష్యత్ కార్యాచరణను ఆదివారం చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఈనెల 29 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రోజూ 500 మందితో శాంతియుతంగా ట్రాక్టర్ మార్చ్ నిర్వహించేలా ఈనెలారంభంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. తమ ఉద్యమానికి ఏడాది పూర్తి కానున్న క్రమంలో ఈ పిలుపునిచ్చింది. సాగు చట్టాల ఉపసంహరణ నేపథ్యం కేంద్ర ప్రకటనతో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించిన తర్వాత తదుపరి ప్రకటన చేస్తామని తెలిపింది. ట్రాక్టర్ మార్చ్లను ఇప్పుడప్పుడే ఉపసంహించుకోమని పేర్కొంది. ఎంఎస్పీకి చట్టబద్ధ హామీ, విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరణనూ డిమాండు చేసింది. ‘ట్రాక్టర్ మార్చ్ పిలుపును ఉపసంహరించుకోవడం లేదు. ఉద్యమం భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించే క్రమంలో దీనిపై తుది నిర్ణయం ఉంటుంది. ఆదివారం సింఘు సరిహద్దు వద్ద ఎస్కేఎం భేటీ జరుగుతుంది. సమావేశంలో ఎంఎస్పీ అంశాలూ చర్చకు వస్తాయి’ అని ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ వెల్లడిరచారు. టిక్రీ సరిహద్దు వద్ద బీకేయూ(యూ) అధ్యక్షుడు జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ మాట్లాడుతూ, ట్రాక్టర్ మార్చ్పై ఎస్కేఎం నిర్ణయిస్తుంది. పార్లమెంటులో మూడు చట్టాలను కేంద్రం అధికారికంగా రద్దు చేసేంత వరకు టిక్రీతో పాటు ఇతర సరిహద్దులను రైతులు ఖాళీ చేయరని స్పష్టంచేశారు. గతంలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) విషయంలోనూ కేంద్రం ఇలాంటి ప్రకటనే చేసింది కాబట్టి ప్రభుత్వ మాటను రైతులు నమ్మడం లేదు అని మరొక నేత సుదేశ్ గోయత్ అన్నారు. పార్లమెంటులో చట్టాలను రద్దు చేసే వరకు శిబిరాల్లోనే ఉంటామన్నారు. నవంబరు 26న ఉద్యమానికి ఏడాది పూర్తి అయ్యే క్రమంలో దిల్లీ సరిహద్దులకు రైతుల తరలింపు ముందు అనుకున్నట్లుగానే జరుగుతుంది అని సుదేశ్ అన్నారు.