Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పాలకుల విధానాల వల్లే అసమానతలు

ఆకలి, ఆదాయం, విద్య, సంపద, న్యాయం అన్నింట్లోనూ అసమానతలే
కోవిడ్‌ సమయంలో 7.7 శాతం తగ్గిన జీడీపీ
102 నుంచి 140కు పెరిగిన కుబేరుల సంఖ్య
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన కోట్లమంది సామాన్యులు
ఆకలి, మానవాభివృద్ధి సూచీల్లో దిగజారిన భారత్‌ ర్యాంక్‌
సి.రాఘవాచారి స్మారకోపన్యాసంలో పాలగుమ్మి సాయినాథ్‌

విశాలాంధ్ర ప్రతినిధి విజయవాడ : పాలకులు అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాల వల్లే దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయని ప్రముఖ జర్నలిస్టు, రామన్‌మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ చెప్పారు. ఆకలి, ఆదాయం, విద్య, సంపద, న్యాయం, చట్టం సహా అన్నింట్లోనూ అసమానతలు కొనసాగుతున్నాయన్నారు. విశాలాంధ్ర పూర్వ సంపాదకుడు, మార్క్సిస్ట్‌ మేధావి సి.రాఘవాచారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా సి.రాఘవాచారి ట్రస్ట్‌ ఆధ్వర్యాన గురువారం విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో విశాలాంధ్ర ఎడిటర్‌ ఆర్వీ రామారావ్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ‘కోవిడ్‌ నేపథ్యంలో ప్రసార మాధ్యమాలుఅసమానతలు’ అనే అంశంపై పాలగుమ్మి సాయినాథ్‌ స్మారకోపన్యాసం చేశారు. దేశంలో 1991 నుంచి అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాల వల్ల అసమానతలు మరింత రెట్టింపయ్యాయని చెప్పారు. కోవిడ్‌ సమయంలో మొదటి 12 నెలల్లో జీడీపీ 7.7 శాతం తగ్గిందని, కానీ దేశంలో 102 మందిగా ఉన్న బిలియనీర్ల సంఖ్య 140కి పెరిగిందని, వారి సంపద రూ.596 బిలియన్‌ డాలర్లకు చేరిందని వివరించారు. దేశ జనాభాలో 0.00,004 శాతం అయిన 140 మంది సంపద జీడీపీలో 22.7 శాతం కాగా, సంపదను సృష్టిస్తున్న సుమారు 91.3 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, దిల్లీలో సెంట్రల్‌ విస్టాకు మాత్రం రూ.24 వేలకోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ప్రభుత్వ గోడౌన్లలో 104 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలు బఫర్‌ స్టాక్‌ ఉన్నప్పటికీ పేదల ఆకలి బాధలు తీర్చేందుకు పంపిణీ చేయలేదని, అయితే పరిశ్రమలకు లబ్ధి చేకూర్చేలా హ్యాండ్‌ శానిటైజర్ల కోసం గోడౌన్లలోని బియ్యాన్ని ఇథనాయిల్‌ తయారీ కంపెనీలకు ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించిందని చెప్పారు. ఆకలి, మానవవనరుల అభివృద్ధి సూచీ, ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌లో ఆఫ్రికా దేశాల కన్నా మనదేశం దిగువన ఉందన్నారు. దేశంలోని అత్యంత ధనవంతుల్లో తొలి ఐదుగురు గుజరాతీలేనని, కానీ ఆ రాష్ట్రంలో పిల్లలు సరైన పోషకాహారం లేక 39.3 శాతం మంది గుండె జబ్బులు, 6 శాతం మంది రక్తహీనతతో చిక్కిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కుబేరుల్లో 24 మంది ఫార్మా, ఆరోగ్య రంగాలకు చెందినవారేనని, కానీ దేశంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయని తెలిపారు. దేశంలోని 140 మంది సంపన్నులు తమ సంపదలో 10 శాతం పన్ను ఒకసారి చెల్లిస్తే గ్రామీణ భారతదేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా పథకాలు అమలు చేయవచ్చని వివరించారు. కానీ, ప్రభుత్వాలు మాత్రం సంపన్నులకు పన్ను రాయితీలు ఇస్తూ సామాన్యులపై భారీగా భారం మోపుతున్నాయని చెప్పారు. ఆర్థిక, వైద్యం, విద్య, పాలకుల ఆలోచన విధానాలకు సంబంధించి మన దేశ వాస్తవ పరిస్థితిని కోవిడ్‌`19 స్పష్టం చేసిందన్నారు. మత విషయాల్లో కూడా అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, గోల్వాల్కర్‌ గురూజీ భావజాలాన్నీ హిందూత్వవాదులు అనుసరిస్తూ ముస్లింలను దేశంలో ద్వితీయ స్థాయి పౌరులుగా ఉండాలని, లేకపోతే దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సామాజిక, ఆర్థిక, న్యాయ, విద్యా రంగాల్లో తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. చరిత్రను సైతం వక్రీకరిస్తున్నారని, సావార్కర్‌ను గొప్పదేశభక్తుడిగా చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారన్నారు. అన్ని అంశాల్లో అసమానతలు, దోపిడీ, వివక్ష పెరిగిపోతున్నా మీడియా ప్రశ్నించడం లేదన్నారు. రాజారామ్మోహన్‌రాయ్‌ తన సంవాద కౌముది పత్రికలో 200 ఏళ్ల కిందట రైతు మృతికి సంబంధించి రాసిన ఎడిటోరియల్‌పై బ్రిటీష్‌ ప్రభుత్వం స్పందించి మేజిస్టీరియల్‌ విచారణ చేసి, ఉద్యోగం నుంచి తొలగించిందని గుర్తుచేశారు. కానీ నేడు స్వేచ్ఛాయుత జర్నలిజం లేదని, దేశంలోని 99.9 శాతం మీడియా సంస్థలు కార్పొరేట్ల నియంత్రణలోనే ఉన్నాయన్నారు. మీడియా సంస్థలకు కోట్లాది రూపాయలను యాడ్స్‌ రూపంలో కార్పొరేట్లు అందించి పరోక్షంగా యజమానులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రపంచ చరిత్రలోనే దిల్లీ సరిహద్దుల్లో రైతులు 11 నెలలుగా మహత్తర పోరాటం సాగిస్తున్నా, ఒక్క కార్పొరేట్‌ మీడియా కూడా కవర్‌ చేయడం లేదన్నారు. రైతులు ప్రతి నిమిషం అంబానీ, అదానీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నా కనీసం వారి పేర్లు కూడా మీడియా సంస్థలు ప్రస్తావించడం లేదన్నారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడేళ్లయినా ఒక్కసారి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టలేదన్నారు. స్వంతంత్ర భారత దేశ చరిత్రలోనే ప్రెస్‌మీట్‌ పెట్టకుండా ఉన్న ఏకైక ప్రధాని మోదీ అని అన్నారు. భారత రాజ్యాంగాన్ని కూడా పక్కనపెట్టి క్రమంగా మనుస్మృతిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దేశంలో స్వేచ్ఛ, అసమానతలు లేని సమాజం, అన్ని వర్గాల అభివృద్ధి కోసం పోరాటం సాగించాల్సిన అవసరం ఉందన్నారు. తొలుత రాఘవాచారి చిత్రపటానికి సాయినాథ్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సమతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు వీవీ కృష్ణారావు, రాఘవాచారి సతీమణి జ్యోత్స్న, ప్రోగ్రెసివ్‌ ఫోరం నాయకుడు అక్కినేని చంద్రరావు తదితరులు రాఘవాచారి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. రాఘవాచారి కుమార్తె డాక్టర్‌ అనుపమ ట్రస్ట్‌ కార్యకలాపాల నివేదికను వెల్లడిరచారు. ఈ కార్యక్రమానికి కేఎల్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బుడ్డిగ జమిందార్‌ స్వాగతం పలకగా, పాలగుమ్మి సాయినాథ్‌ను ప్రొఫెసర్‌ ఎన్‌.అంజయ్య సభకు పరిచయం చేశారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చంద్రానాయక్‌, సీనియర్‌ కళాకారులు ఆర్‌.పిచ్చయ్య, ఎస్‌కే నజీర్‌ దేశభక్తి గేయాన్ని ఆలపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img