. స్థానిక యంత్రాంగానికి ఎల్జీ కట్టుబడాలి
. శాంతిభద్రతలు, పోలీస్ వ్యవస్థపై అధికారం కేంద్రానిది
. సుప్రీంకోర్టు స్పష్టీకరణ బ ‘అధికార’ వివాదానికి తెర
న్యూదిల్లీ: పాలనాధికారం దిల్లీ ప్రభుత్వానిదేనని సర్వోన్నత న్యాయస్థానం గురువారం తేల్చిచెప్పింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడాలని, శాంతి భద్రతలు మినహా అన్నీ దిల్లీ ప్రభుత్వం నియంత్రణలోనే ఉండాలని పేర్కొంది. దీంతో దేశ రాజధాని దిల్లీలో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఆప్ ప్రభుత్వాన్ని విజయం వరించింది. పబ్లిక్ ఆర్డర్, భూమి, పోలీసు వ్యవస్థ మినహా అన్ని సేవలు దిల్లీ ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అధికారాలకు సంబంధించి దిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య 2015 నుంచి వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఎనిమిదేళ్ల వివాదానికి సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వ ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెరదించింది. ఐఏఎస్ లేక జాయింట్ కేడర్ సర్వీసెస్, బదిలీలు, నియామకాలు అన్నీ స్థానిక ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయని పేర్కొంది. ప్రజాస్వామ్యం, ఫెడరలిజం సిద్ధాంతాలు మన రాజ్యాంగంలో ప్రధాన అంశాలని, బహుళ`సంస్కృతి, మతాలు, ఆచారాలు, భాషలున్న భారత్ వంటి దేశంలో ఫెడరలిజం వైవిధ్యతకు ప్రతీకని, ఫెడరల్ రాజ్యాంగంలో ద్వంద్వ పాలన గురించి ఉన్నదని ( ఒకటి జాతీయ స్థాయిలో రెండు ప్రాంతీయ ఫెడరల్ యూనిట్ల స్థాయి) సుప్రీంకోర్టు వెల్లడిరచింది. లిస్ట్2 (పబ్లిక్ ఆర్డర్, పోలీస్, భూమి) మినహా లిస్ట్ 2, లిస్ట్ 3 (రాష్ట్ర, కాన్కరెస్ట్ లిస్ట్) ఎన్సీటీడీ (నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్) శాసనసభ పరిధిలో ఉంటాయని గురువారం వెలువరించిన 105 పేజీల తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అసలైన అధికారాలు, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల వద్ద ఉండాలని పేర్కొంది. పాలనా వ్యవహారాలపై నియంత్రణ కూడా వారిదే అయివుండాలని, ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాలకు ఎల్జీ కట్టుబడి ఉండాలని తెలిపింది.
అధికారులు… మంత్రులకు నివేదించకపోతే, వారి ఆదేశాలను పాటించకపోతే, సమగ్ర పాలనా విధానాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని వెల్లడిరచింది. దేశంలోని ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరిగా దేశ రాజధాని దిల్లీ ఉండదని, ఇది ప్రత్యేకమని, పబ్లిక్ ఆర్డర్, భూమి, పోలీసు వ్యవస్థపై అధికారాలు కేంద్రం వద్ద ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం వివరించింది.
ఇతర రాష్ట్రాల్లానే దిల్లీలోనూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి పాలనా అధికారాలు స్థానిక ప్రభుత్వానికే ఉంటాయని స్పష్టంచేసింది. తమను ఎన్నుకున్న ప్రజలకు సేవ చేయడం ఎన్నికైన ప్రభుత్వ బాధ్యతని తెలిపింది. ఆయా సేవలపై దిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవని 2019లో జస్టిస్ అశోక్ భూషణ్ ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం తోసిపుచ్చింది. కాగా గతేడాది మే6న కూడా దిల్లీ అధికారాలపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.