ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ ) అధికారిక ఖాతాలను కూడా గురువారం నుండి కేంద్రం నిలిపివేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పిఎఫ్ఐతో పాటు ఎనిమిది అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సుమారు 200మందికి పైగా పిఎఫ్ఐ నేతలను అదుపులోకి తీసుకుంది. అయితే, సోషల్ మీడియా వేదికగా ఈ సంస్థ తమ కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉందంటూ పిఎఫ్ఐకి చెందిన అన్ని వెబ్సైట్లు, సోషల్మీడియా ఖాతాలను మూసివేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.దీంతో పిఎఫ్ఐ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలు కూడా నిలిచిపోనున్నాయి. పిఎఫ్ఐ అధికార ఖాతాను సుమారు 81వేల మంది అనుసరిస్తున్నారు. అలాగే పిఎఫ్ఐ చైర్పర్సన్, ప్రధాన కార్యదర్శిల ఖాతాలను కూడా నిలిపివేసింది.తమ విభాగాలన్నింటినీ నిర్వీర్యం చేసేందుకే నిషేధం విధించినట్లు పిఎఫ్ఐ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పిఎఫ్ఐ విద్యార్థుల విభాగం పేర్కొంది. పిఎఫ్ఐపై నిషేధం విధించడాన్ని కేరళలోని కాంగ్రెస్, దాని సంకీర్ణ భాగస్వామి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) స్వాగతించాయి. అయితే ఆర్ఎస్ఎస్ని కూడా నిషేధించాలని సూచించింది. కొందరు వ్యక్తులు చేసిన నేరాలకు సంస్థను నిషేధించడం సరికాదంటూ హైదరాబాద్ ఎంపి, ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.