విశాలాంధ్ర- సూళ్లూరుపేట : పీఎస్ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోగల మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్ను ఇస్రో ప్రయోగించింది. ఈవోఎస్-06తో పాటు ఎనిమిది సూక్ష్మ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. సరిగ్గా 17.21 నిమిషాలకు రాకెట్ పై భాగంలోని ఓషియన్శాట్ కక్షలోకి ప్రవేశించింది. అనంతరం రాకెట్లోని చివరి భాగం దిశ మార్చుకుని ఆస్ట్రోకాస్ట్ ఉపగ్రహాలు నాలుగింటిని, తైబొల్ట్ ఉపగ్రహాలు రెండు, ఆనంద్ ఉపగ్రహాలతో పాటు భారత్` భూటాన్ సంయుక్తంగా రూపొందించిన ఐఎన్ఎస్-2బీ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షల్లో ప్రవేశపెట్టింది. 2.05 గంటల్లో ప్రయోగం పూర్తి అయింది. ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఇస్రో చైర్మన్ సోమనాథ్, భూటాన్ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. కడలిపై అధ్యయనానికి ఓషియన్శాట్ ఉపగ్రహం ఎంతగానో దోహదమవుతుందని ఇస్రో వెల్లడిరచింది. పీఎస్ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సోమనాథ్ మాట్లాడుతూ, ప్రయోగానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు గంటల్లో ప్రయోగం పూర్తి అయిందని, ఎనిమిది ఉపగ్రహాలను నిర్దేశిక్ష కక్షలలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామని చెప్పారు. గగన్యాన్ ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. డిసెంబరులో మరో రెండు ప్రయోగాలు ఉంటాయన్నారు. వచ్చే ఏడాది మానవరహిత ప్రయోగాలు ఉంటాయని, జీఎస్ఎల్వీ మార్క్ 3 ద్వారా ఆర్య ఎల్వన్, మరో 36 ఉపగ్రహాలను కలిపి ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని సోమనాథ్ తెలిపారు.