న్యూదిల్లీ: పెగాసస్ వ్యవహారానికి సంబంధించిన వ్యాజ్యాలపై విచారణను ఈ నెల 23వ తేదీకి బదులు 25న చేపట్టేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకారం తెలిపింది. తాను మనీలాండరింగ్ కేసును మరొక న్యాయస్థానం ఎదుట వాదించాల్సి ఉన్నందునే వాయిదా కోరుతున్నట్లు కేంద్రం తరపు ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ చెప్పడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం వెబ్సైట్ ప్రకారం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం పెగాసస్ కేసులను విచారించాల్సి ఉంది. పెగాసస్ వ్యవహారంలో గతేడాది అక్టోబరు 27న చివరిసారిగా విచారణ జరిగింది. భారత్లో కొందరిపై నిఘా పెట్టారన్న ఆరోపణల దృష్ట్యా విచారణ కోసం త్రిసభ్య నిపుణుల కమిటీ ఏర్పాటుకు సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది. దీనిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్వీ రవీంద్రన్ పర్యవేక్షిస్తారని తెలిపింది. ప్రస్తుత ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్ బొప్పన్నా , జస్టిస్ హిమా కోహ్లీ ఉన్నారు. ‘పెగాసస్ వ్యవహారం మీ ముందర విచారణకు రానున్నది. నేను వాదనలు వినిపించాల్సి ఉంది కానీ పీఎంఎల్ఏ కేసు విషయంలో కోర్టు ఎదుట హాజరు కావాలి. ఉదయం 10.30 గంటల నుంచి తీరిక ఉండదు. అందుకే బుధవారానికి బదులు శుక్రవారం పెగాసస్ కేసులను విచారించగలరు’ అని సొలిసిటర్ జనరల్ కోరగా ‘సరే, సంబంధిత వర్గాలకు సమాచారం ఇవ్వండి’ అని సీజేఐ అన్నారు. అలాగే అని న్యాయాధికారి బదులిచ్చారు. ఎడిటర్స్ గిల్డ్తో పాటు సీనియర్ జర్నలిస్టులు ఎన్.రామ్, శశికుమార్ వేసిన వాటితో కలిపి మొత్తం 12 వ్యాజ్యాలను ప్రత్యేక ధర్మాసనం విచారించనుంది.