ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
పిల్లల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు.ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ఓ కూడా స్కూళ్లు తెరవాలని సూచించారని, కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న.. గ్రామ సచివాలయాలు యూనిట్గా తీసుకుని స్కూళ్లను ప్రారంభించామని పేర్కొన్నారు. పేద విద్యార్థుల జీవితాల్లో మార్పులు రావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత పనులు పూర్తైన పాఠశాలలను పైలన్ ఆవిష్కరించి సీఎం జగన్ ప్రారంభించారు. ‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించారు. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా వైఎస్ జగన్ వాటిని విద్యార్థులకు అంకితం చేశారు. అనంతరం రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న విద్యా కానుక’ రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో సీఎం జగన్ ప్రారంభించారు. హైస్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, కొవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించామని చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్ధులకు ‘జగనన్న విద్యాకానుక’ కింద బై లింగువల్ టెక్ట్స్బుక్స్, నోట్బుక్స్, వర్క్బుక్స్, డిక్షనరీ ఇస్తున్నామని పేర్కొన్నారు.