ఈశాన్యరాష్ట్రం ఆర్మీ కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో వివరణ ఇచ్చారు. నాగాలాండ్లో ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా.. అదుపులోనే ఉందని ఇవాళ లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. మాన్లోని ఓటింగ్లో తీవ్రవాదుల కదలికలు ఉన్నట్లు ఆర్మీకి సమాచారం వచ్చిందని, ఆ సమయంలో అనుమానాస్పద ప్రాంతంలో సుమారు 21 మంది కమాండోలు ఆపరేషన్కు సిద్దమయ్యారని, అయితే అక్కడకు వచ్చిన వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా.. ఆ వాహనం ఆగకుండా వెళ్లిందన్నారు. దీంతో ఆ వాహనంలో తీవ్రవాదులను తరలిస్తున్నట్లు అనుమానించి ఆర్మీ కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. ఆ వాహనంలో ఉన్న 8 మందిలో 6 గురు కాల్పులకు బలైనట్లు చెప్పారు. గాయపడ్డ ఇద్దరిని సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి ఆర్మీ తరలించిందన్నారు. ఈ ఘటన తర్వాత గ్రామస్తులు ఆర్మీ యూనిట్ను చుట్టుముట్టి, రెండు వాహనాలు ధ్వంసం చేశారని, సైనికులపై తిరగబడ్డారని చెప్పారు.గ్రామస్థుల తిరుగుబాటులో ఓ సైనికుడు మృతిచెందినట్లు ఆయన వెల్లడిరచారు. ఆత్మరక్షణ కోసం సైనికులు ఫైరింగ్ జరిపారన్నారు. కాల్పుల వల్ల మరో ఏడు మంది పౌరులు మృతిచెందినట్లు వెల్లడిరచారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని డిసెంబర్ 5వ తేదీన నాగాలాండ్ డీజీపీ, కమీషనర్ విజిట్ చేశారన్నారు. ఆర్మీ కాల్పుల ఘటన పట్ల ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామన్నారు. కేసు విచారణ కోసం రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. నెల రోజుల్లోనే విచారణను పూర్తి చేయాలని సిట్ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.