. ప్రాజెక్టు నీటి నిల్వపై కేంద్రం
. సగం నిర్వాసిత కుటుంబాలకే ఏపీ సాయం
. మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉన్నా చేయలేదు
. పార్లమెంటులో మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క ప్రకటనలు గుప్పిస్తుండగా… కేంద్ర ప్రభుత్వం 41.15 మీటర్లకే పరిమితం చేసినట్లు పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. ఇది తొలిదశలో అని మెలిక పెట్టినప్పటికీ దశలవారీ నిబంధనలతో ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ఏపీకి కేంద్రం చేస్తున్న మరో మోసంగా పేర్కొనవచ్చు. 2022 నాటికే ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేస్తామని చెప్పిన కేంద్రం…ఇప్పుడు 2023లో తొలిదశ, మలిదశ అంటూ ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం అన్యాయం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్ సత్యవతి గురువారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తొలిదశలో ప్రాజెక్టులో నీటి నిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
తొలిదశ సహాయ, పునరావాసం కూడా అంతవరకేనని తేల్చి చెప్పారు. వాస్తవానికి తొలిదశ సహాయ, పునరావాసం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే పూర్తి కావాల్సి ఉండగా, అందులో సగం కూడా కాలేదన్నారు. తొలిదశలో మొత్తం 20,946 నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాసం కల్పించాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయం అందించినట్లు చెప్పారు.
మిగతావారికి సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా ఇంతవరకు చేయలేదని ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నట్లు మంత్రి వెల్లడిరచారు.