జలవిద్యుత్ ప్రిజర్వ్ టన్నెల్స్ తవ్వకం పనులు ప్రారంభించిన మేఘా
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి :
పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. పోలవరం ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రం పనులు ఇప్పటికే శరవేగంగా సాగుతుండగా, దీనిలో అత్యంత కీలకమైన ప్రిజర్వ్ టన్నెల్స్ తవ్వకం పనులను శుక్రవారం జెన్కో అధికారులు, మేఘా సంస్థ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెన్కో ఎస్ఈ ఎస్.శేషారెడ్డి, ఈఈలు ఎ.సోమయ్య, సి.హనుమ, ఎలక్ట్రికల్ ఈఈ వై.భీమధనరావు, జలవనరుల శాఖ ఈఈ పాండురంగారావు, మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఉపాధ్యక్షుడు రంగరాజన్, జీఎం ముద్దు కృష్ణ, ఏజీఎం క్రాంతికుమార్, కోఆర్డినేటర్ ఠాగూర్ చంద్
పాల్గొన్నారు. జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను రివర్స్ టెండరింగ్ అనంతరం మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ ఏడాది మార్చి 30వ తేదీన పనులు ప్రారంభించింది. ఇప్పటికే దాదాపు 18.90 లక్షల క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం పనులు పూర్తయ్యాయి. అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పనులను మేఘా సంస్థ మరింత వేగవంతం చేసింది.
జల విద్యుత్ కేంద్రం ప్రత్యేకతలు
పోలవరం జలవిద్యుత్ కేంద్రం 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ సామర్ధ్యంతో నిర్మిస్తున్నారు. ఇందులో 12 వెర్టికల్ కెప్లాన్ టర్బైన్లు ఉంటాయి. ఒక్కో టర్బైన్ 80మెగావాట్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. వీటిని భోపాల్కు చెందిన బీహెచ్ఈఎల్ సంస్థ రూపొందించింది. ఇవి ఆసియాలోనే అతిపెద్దవి. వీటికి సంబంధించి ఇప్పటికే మోడల్ టెస్టింగ్ పూర్తయింది. వీటికోసం 12 ప్రిజర్ టన్నెల్స్ తవ్వాల్సి ఉంటుంది. ఒక్కో టన్నెల్ 145 మీటర్లు పొడవు, 9మీటర్లు డయాతో తవ్వుతారు. వీటికి 12 జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. ఒక్కోటి 100 మెగావాట్ల సామర్ధ్యంతో ఉంటాయి. పవర్ ప్రాజెక్టు కోసం 206 మీటర్ల పొడవున అప్రోచ్ ఛానెల్, 294 మీటర్ల వెడల్పు తవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించి డ్రాయింగ్స్, మోడల్స్ రూపొందించే పనులు సైతం పూర్తి కావొచ్చాయి. ఇక పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 10.5 లక్షల ఎకరాల భూమి సాగవుతుండగా, దీన్ని స్థిరీకరించేందుకు పోలవరం జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే నీటిని వినియోగిస్తారు.