రాష్ట్రపతి పాలనకు సమయం ఆసన్నం
టీడీపీని అంతం చేయడం మీ వల్ల కాదు
36 గంటల దీక్షను ప్రారంభిస్తూ చంద్రబాబు హెచ్చరిక
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అరాచక, అప్రజాస్వామిక పాలనను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో 36 గంటల దీక్ష ప్రారభించారు. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో, తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో పార్టీ కార్యాలయాలపై ఇలాంటి దాడులు ఎన్నడూ చూడలేదన్నారు. టీడీపీని తుదిముట్టించాలి, భయభ్రాంతులకు గురి చేయాలనే దాడికి తెగబడ్డారని, కాని అది మీ వల్ల కాదని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల పక్షాన ప్రతిపక్షాలు మాట్లాడాలన్నా భయపడాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు చేస్తున్నారని, దీనివెనుక పెద్ద కుట్రే జరిగిందని ఆరోపించారు. డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందంటే డీజీపీకి సిగ్గు అనిపించడం లేదా ? అని ప్రశ్నించారు. ‘మమ్మల్ని మేము కాపాడుకోగలం.. పోలీసులకు చేతగాకపోతే స్టేషన్లు మూసేసుకుని వెళ్లండి’ అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 22 సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉందని, ఏనాడూ ప్రతిపక్ష నేతలకు చిన్న ఇబ్బంది కూడా కలగనివ్వలేదన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం, డీజీపీలు ఇంత విధ్వంసం జరిగితే ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ఇప్పటి వరకు తన మంచితనాన్ని చూశారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తా..ఖబడ్దార్ అంటూ జగన్ను హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి కాబట్టే, రాష్ట్రపతి పాలన పెట్టి రాష్ట్రాన్ని కాపాడాలని కోరానన్నారు. పట్టాభి వాడిన భాష తప్పైతే సీఎం, మీ మంత్రులు మాట్లాడిన భాష ఏంటి.? ప్రజల్ని అడుగుదామా ? చర్చకు సిద్ధమా ? అని సవాల్ విసిరారు. ఇక టీడీపీ కార్యాలయంపై దాడికి కారకుడైన మప్టీలో ఉన్న ఒక పోలీసుని టీడీపీ నేతలు పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే, అతని దగ్గర ఫిర్యాదు తీసుకుని తిరిగి వారిపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారంటే డీజీపీకి ఎంత ధైర్యం ? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. మీ ఇష్ట ప్రకారం ఏకపక్షంగా తిడుతూ దాడులు చేస్తూ కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా సహజ వనరులన్నీ హస్తగతం చేసుకున్నారు. లిక్కర్ చూస్తే నాసిరకం బ్రాండ్లు తాగి చనిపోతున్నారు. సొంత బ్రాండ్లు తయారు చేసి కమీషన్లకోసం కక్కుర్తిపడుతున్నారు. ఇసుక ఎక్కడా దొరకడం లేదు. పన్నులు విపరీతంగా పెంచారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. కరెంటు చార్జీలు పెంచారు. పేదల రక్తాన్ని జలగల్లా తాగుతున్నారు. రాష్ట్రం ఏమైపోతుందోనని భయం వేస్తోంది. జగన్ చేసే తప్పులు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేలా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యక్తి మంచి వాడు కాకపోతే దాని ఫలితం మారుతుందని అంబేద్కర్ చెప్పారు. ప్రస్తుతం ఏపీ పరిస్థితి చూస్తుంటే అదే జరుగుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి, ఈ దుష్టపాలనను అంతమొందించడానికి పార్టీ శ్రేణులు సైనికుల్లా త్యాగాలకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలు ప్రసంగించారు.
చంద్రబాబు దీక్షకు ఏఐఎస్ఎఫ్ సంఫీుభావం
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకుల దాడిని నిరసిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్షకు ఏఐఎస్ఎఫ్ సంఫీుభావం తెలిపింది. ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు, ఉపాధ్యక్షులు జాన్సన్ బాబు, కార్యవర్గ సభ్యులు బందెల నాసర్జీ గురువారం చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యన్ని సీఎం జగన్ ఖూని చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో విద్యార్థులకు కేటాయించాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. అమ్మఒడి సాకుతో బీఏఎస్ పథకాన్ని పధకాన్ని రద్దు చేశారని, అధిక ఫీజులు చెలించలేక, ప్రైవేట్ కళాశాలలో చదువుకోలేకపోయిన విద్యార్థులకు ఎయిడెడ్ పద్ధతిని తొలగించి విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేసిందని విమర్శించారు. విద్యా వ్యతిరేక విధానాలను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.