ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ను ప్రారంభించిన మోదీ
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ను ఇవాళ ప్రధాని మోదీ వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య చికిత్సను అందించడంలో ఎదురయ్యే సమస్యను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పరిష్కరిస్తుందని చెప్పారు. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను ఈ కార్యక్రమం తీసుకు వస్తుందన్నారు.ఈ స్కీమ్ కింద ప్రతి భారతీయుడికి డిజిటల్ హెల్త్ ఐడీని ఇవ్వనున్నట్లు తెలిపారు.ఆయుష్మాన్ భారత్ రోగుల సేవల గురించి దేశవ్యాప్తగా అన్ని హాస్పిటళ్లకు విస్తరిస్తుందన్నారు. సాంకేతికంగా బలమైన ఫ్లాట్ఫామ్తో సులభమైన వైద్య చికిత్స వీలవుతుందన్నారు. డిజిటల్ మౌళిక సదుపాయాలు ఇండియాలో భారీ స్థాయిలో ఉన్నాయని, దేశంలో యూపీఐ విధానంలో అన్ని పనులు జరుగుతున్నాయని, 118 మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారని, 80 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని, 43 కోట్ల మందికి జన్ధన్ అకౌంట్లు ఉన్నాయని, ఇలాంటి భారీ డిజిటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ దేశంలోనూ లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ‘ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని గత ఏడాది ఆగస్టు 15 న ఎర్రకోట నుండి ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని పైలట్ దశలో ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు.. అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ, డామన్-డయు, లఢక్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో అమలు చేయనున్నారు.ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ ఐడీ అందిస్తారు. హెల్త్ అకౌంట్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని అందులో పొందుపరుస్తారు. ఏదైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు తమ హెల్త్ ఐడీ నమోదు చేయగానే ఆటోమేటిక్గా ఆ రోగి పూర్తి ఆరోగ్య సమాచారం డాక్టర్లకు కనిపిస్తుంది. కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది.