ఆర్బీకేల్లో పశుసంవర్థకశాఖ బలోపేతం
వైద్యఆరోగ్యశాఖ తరహాలో అంచెల విధానం
పశువుల అంబులెన్స్లు ప్రారంభించిన సీఎం జగన్
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రతి పశువుకు హెల్త్ కార్డు ఇచ్చే దిశగా ఆలోచన చేయాలని వైద్యాధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. దీనివల్ల వాటికి అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ సులభమవుతుందని అన్నారు. పశుసంవర్థక శాఖలో ఏ పథకం అమలు చేసినా అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవలో భాగంగా రూ.111.62కోట్లతో కొనుగోలు చేసిన 165 పశు అంబులెన్స్లను జగన్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పశు సంవర్థకశాఖ, మత్య్సశాఖలపై సమీక్ష జరిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పాల నాణ్యత పెరగాలని, రసాయనాలకు తావులేని పశుపోషణ విధానాలపై అవగాహన పెంచాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పశువుల అంబులెన్సులు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని, ఇందుకోసం ఎస్ఓపీ రూపొందించాలని సూచించారు. వైద్యారోగ్య శాఖలో మండలానికి రెండు పీహెచ్సీలు, ప్రతి సచివాలయానికి ఒక విలేజీ క్లినిక్స్ ఉన్నట్లే పశు సంవర్థక శాఖలోనూ అంచెల విధానాన్ని తేవాలన్నారు. యూనిఫార్మిటీ (ఏకరూపత)తో మంచిసేవలు అందుతాయని, అందుకసం మార్గదర్శక ప్రణాళికను రూపొందించాలని సీఎం సూచించారు. ప్రజారోగ్యానికి సంబంధించి గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్, అందులో ఏఎన్ఎం, అండగా ఆశావర్కర్లు ఇలా ఒక వ్యవస్థ ఏర్పడిరది. అదే తరహాలో ఆర్బీకేల్లో ఉన్న పశుసంవర్థక విభాగాన్ని బలోపేతం చేయాలని అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. ప్రతి మండల స్థాయిలో ఉన్న ఈ వ్యవస్ధ నుంచి ఆర్బీకేల్లో ఉన్న పశుసంవర్థకశాఖ అసిస్టెంటుకు పూర్తి మద్దతు ఉండాలన్నారు. దీనివల్ల సంతృప్తస్థాయిలో పశువులకు తగిన వైద్యంతో సహా పోషణ సేవలను అందించే వీలవుతుందని చెప్పారు. పశువులకు పంపిణీ చేసిన మందులను నిల్వ చేయడానికి ప్రతి ఆర్బీకేలో ఫ్రిజ్ సహా అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండాలని సూచించారు. రెండు నెలల్లో మరో 1422 గ్రామాల్లోకి జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడిరచారు. అనంతరం మొదటి విడతలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులపై, ఆక్వారంగంపై జగన్ సమీక్షించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్ (ఎఫ్ఏసీ) వై.మధుసూదన్రెడ్డి, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ బాబు ఎ, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్ర కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.